పాతవి లేవు.. కొత్తవి రావు
ABN , Publish Date - Nov 08 , 2024 | 02:53 AM
ఆర్టీసీ ప్రభుత్వరంగ సంస్థగా ఉన్నప్పుడు ఉద్యోగులకు అమలైన పథకాలను కొనసాగిస్తూనే..
ఆర్టీసీ విలీనం తర్వాత ఉద్యోగులకు ఇబ్బందులు
పీఆర్సీ ఆలస్యం.. తక్షణమే ఐఆర్ ప్రకటించండి: ఎన్ఎంయూఏ
విజయవాడ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రభుత్వరంగ సంస్థగా ఉన్నప్పుడు ఉద్యోగులకు అమలైన పథకాలను కొనసాగిస్తూనే.. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి కోరారు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) కోరుకున్నట్టుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో గుర్తింపు ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం గురువారం విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 123 డిపోల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో అప్పట్లో సాధించుకున్న పథకాలు ఒక్కొక్కటీ దూరమయ్యాయని చెప్పారు. ఎమ్మెల్సీ పి.అశోక్బాబు మాట్లాడుతూ విలీనం తర్వాత ఈహెచ్ఎ్సతో ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి పాత విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ అమలులో ఆరు నెలల జాప్యం జరిగిందని, అందువల్ల తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు, లీవ్ ఎన్క్యా్షమెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, పెన్షనర్లకు పరిమితిలేని వైద్య సదుపాయాలను పునరుద్ధరించాలన్నారు. గత టీడీపీ హయాంలోని 1/2018 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని కోరారు. ఏటా 2వేల కొత్త ఆర్టీసీ బస్సులు కొనేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ నైట్ అవుట్ అలవెన్సులను ఎరియర్స్తోసహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీలో అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, గ్యారేజీల సమస్యలు, నాన్ ఆపరేషనల్ యూనిట్లలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తంనాయుడు, పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.