200 మంది సభ్యుల్లోంచి 2 గంటల్లోనే
ABN , Publish Date - Mar 22 , 2024 | 05:13 AM
ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం ఆదరాబాదరాగా జరిగిందంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా ఆక్షేపించింది. 200మంది సభ్యుల్లోంచి కొన్ని గంటల్లోనే ఆరుగురిని షార్ట్లిస్ట్ ఎలా చేస్తారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
![200 మంది సభ్యుల్లోంచి 2 గంటల్లోనే](https://media.andhrajyothy.com/media/2024/20240313/44_ce0bbb0ada.jpg)
ఆరుగురిని షార్ట్లిస్ట్ ఎలా చేస్తారు?
కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఈసీల నియామకంపై స్టే ఇవ్వలేమని స్పష్టం
న్యూఢిల్లీ, మార్చి 21: ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం ఆదరాబాదరాగా జరిగిందంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా ఆక్షేపించింది. 200మంది సభ్యుల్లోంచి కొన్ని గంటల్లోనే ఆరుగురిని షార్ట్లిస్ట్ ఎలా చేస్తారు? అని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మాజీ ఐఏఎస్ జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ ఈసీలుగా నియమించిన నేపథ్యంలో సుప్రీం పైవిధంగా స్పందించింది. ఈసీల నియామకంపై 200మంది సభ్యుల పేర్లను పరిశీలించవచ్చు. అయితే ఇందుకు టైం ఎంత ఇచ్చారు? బహుశా రెండే రెండు గంటలుకావొచ్చు. ఈ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉండాల్సింది అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. లోక్సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈసీల నియామకం కోసం కొత్తగా తెచ్చిన చట్టాన్ని నిలపివేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని గురువారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేసింది. ఈసీల నియామకం కోసం 200మంది సభ్యులోంచి గంటల వ్యవధిలో ఆరుగురితో షార్ట్లిస్ట్ వెలువరించడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించినా ఈసీల నియామకంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సమయంలో ఈసీల నియామకంపై స్టే విధిస్తే తీవ్ర అనిశ్చితి, గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది. దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఈసీల నియామకంపై కేంద్రం తెచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలిస్తామని, వీటిపై ఆరువారాల్లోగా స్పందన తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.