‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ నియంతృత్వమే
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:03 AM
‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ ఆలోచనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నియంతృత్వమేనని విమర్శించారు.

ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
రామ్నాథ్ కోవింద్ కమిటీకి టీఎంసీ చీఫ్ మమత లేఖ
కోల్కతా, న్యూఢిల్లీ, జనవరి 11: ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ ఆలోచనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది నియంతృత్వమేనని విమర్శించారు. లోక్సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’తో తాము ఏకీభవించడం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేశ్ చంద్రకు గురువారం లేఖ రాశారు. ఈ విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని, ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా ఇది మారుతుందని పేర్కొన్నారు.
సీట్ల పంపకాలపై కూటమి సమావేశానికి వెళ్లం: టీఎంసీ
లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ కూటమి కమిటీతో జరిగే సమావేశానికి తమ ప్రతినిధులను పంపబోమని, తమ వైఖరిని ఇప్పటికే మహాకూటమికి తెలియజేశామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గాలు గురువారం వెల్లడించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకాలపై కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ సమావేశాల కోసం కాంగ్రెస్.. తమ పార్టీ నేతలను సంప్రదించిందని, ఈ చర్చలకు తమ ప్రతినిధులను పంపించడానికి ఆసక్తిగా లేమని టీఎంసీ వర్గాలు తెలిపాయి.