Bihar CM Nitish : నేడు రాజీనామా.. ప్రమాణం!
ABN , Publish Date - Jan 28 , 2024 | 01:38 AM
జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ మద్దతుతో ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్షాతోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కావచ్చని
![Bihar CM Nitish : నేడు రాజీనామా.. ప్రమాణం!](https://media.andhrajyothy.com/media/2023/20231205/1nitish000163_369d42d50d.jpg)
బీజేపీ మద్దతుతో బిహార్ సీఎంగా 7వ సారి నితీశ్
అమిత్షా, జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం
బీజేపీకి రెండు డిప్యూటీ సీఎంలు, స్పీకర్ పదవి
నితీశ్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది..
ఇండియా కూటమితో పొత్తు ఖతం: జేడీయూ
ఖర్గే ఫోన్ చేసినా నితీశ్ మాట్లాడలేదు: జైరాం
న్యూఢిల్లీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు బీజేపీ మద్దతుతో ఏడోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్షాతోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కావచ్చని తెలుస్తోంది. 2022 ఆగస్టులో బీజేపీని వీడి ఆర్జేడీతో చేతులు కలిపి సీఎం పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్ ఇప్పుడు.. ఆర్జేడీకి మొండిచేయి చూపి మళ్లీ బీజేపీతో కలువనున్నారు. ఈ మేరకు సీఎం పదవికి ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిహార్లో జేడీయూను చీల్చి తనను పదవి నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతోనే ఆయన మళ్లీ బీజేపీ చెంతకు చేరుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. నితీశ్ నేతృత్వంలో జేడీయూ ఎమ్మెల్యేలు పట్నాలో సమావేశమయ్యారు. మరోవైపు, ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆయన నివాసంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ భేటీ అయ్యారు. నితీశ్ సారథ్యంలోని జేడీయూకి బీజేపీతోపాటు మాజీ సీఎం జితన్రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామీ మోర్చా కూడా మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు, అసెంబ్లీ స్పీకర్ పదవితో పాటు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చేలా ఆ పార్టీతో జేడీయూకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఆదివారం ఉదయం బీజేపీ, జేడీయూ విడివిడిగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సెక్రటేరియట్తోపాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. కాగా, బిహార్ పరిణామాలపై జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రె్సలో కొందరు నేతలు నితీశ్ను పలుమార్లు అవమానించారని ఆరోపించారు. బెంగాల్, పంజాబ్లలోలాగే బిహార్లో కూడా ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు ముగియనుందన్నారు. కాగా, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ వైఖరి లౌకిక ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై బీజేపీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.