52 ఏళ్ల మహిళ.. 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల పరుగు
ABN , Publish Date - Jun 17 , 2024 | 05:56 AM
సింగపూర్కు చెందిన నటాలీడౌ(52) అనే మహిళ అనితర సాధ్యమైన ఓ సాహసాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు. నటాలీ డౌ 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. ఈ క్రమంలో ఏకంగా మూడు దేశాలను చుట్టేశారు. గత మే 25వ తేదీన థాయ్లాండ్లో

అలా్ట్రమారథాన్ నటాలీడౌ ఘనత ఇది
న్యూఢిల్లీ, జూన్ 16: సింగపూర్కు చెందిన నటాలీడౌ(52) అనే మహిళ అనితర సాధ్యమైన ఓ సాహసాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేశారు. నటాలీ డౌ 12 రోజుల్లో వెయ్యి కిలోమీటర్ల దూరం పరుగెత్తారు. ఈ క్రమంలో ఏకంగా మూడు దేశాలను చుట్టేశారు. గత మే 25వ తేదీన థాయ్లాండ్లో పరుగును మొదలుపెట్టిన నటాలీ.. మలేషియా మీదుగా జూన్ 5న సింగపూర్ చేరుకుని ఈ అరుదైన ఫీట్ సాధించారు. మహిళలు, బాలికల ఆరోగ్యం అనే అంశంపై అవగాహన కల్పించడంతోపాటు విరాళాల సేకరణే లక్ష్యంగా ‘ప్రాజెక్ట్ 1000’ పేరిట ఆమె ఈ పరుగును ప్రారంభించారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు తన 30వ ఏట పరుగును ప్రారంభించిన నటాలీడౌ.. ప్రాజెక్ట్ 1000లో భాగంగా రోజుకి 84.2 కిలోమీటర్లు చొప్పున పరుగెత్తారు. తాను నిర్దేశించుకున్న 1000 కిమీల లక్ష్యాన్ని 12 రోజుల్లో పూర్తి చేశారు. అంటే ప్రతీ రోజు రెండు మారథాన్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఎండ, వానలు, తుంటి గాయం, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ఎండల నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజులు అర్ధరాత్రి తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజాము వరకు పరుగెత్తేవారు. ఏదేమైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నటాలీడౌ.. ‘ఫాస్టెస్ట్1000 కిమీ థాయ్లాండ్- సింగపూర్ అల్ర్టామారథాన్’ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాక, అత్యంత వేగంగా మలేషియాను కాలినడకన దాటిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నమోదు చేశారు. ఇక, తన పరుగుతో నటాలీడౌ క్రీడల ద్వారా మహిళలు, అమ్మాయిల్లో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేసే ఓ సంస్థకు 50 వేల డాలర్లు(దాదాపు రూ.42లక్షలు) విరాళాలు సేకరించారు.