Share News

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ మోదీని గద్దె దింపుదాం!

ABN , Publish Date - Apr 01 , 2024 | 04:16 AM

కెప్టెన్లపై ఒత్తిడి పెంచి.. క్రీడాకారులను కొనుగోలు చేస్తే క్రికెట్‌ పరిభాషలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారని, ఇలానే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌  మోదీని గద్దె దింపుదాం!

ఈసీలు అనే అంపైర్లను మోదీనే ఎంపిక చేశారు

ముగ్గురు-నలుగురు బిలియనీర్లను అడ్డం పెట్టుకొని

‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ద్వారా గెలవాలని అనుకుంటున్నారు

సీబీఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపిస్తారా?

బీజేపీ మళ్లీ వస్తే ప్రస్తుత రాజ్యాంగాన్ని ఖతం చేస్తారు

మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుండా

బీజేపీకి 180 సీట్లు కూడా రావు: రాహుల్‌ గాంధీ

కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ను విడుదల చేయాలి

ఢిల్లీలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సభ’లో విపక్ష నేతలు

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కెప్టెన్లపై ఒత్తిడి పెంచి.. క్రీడాకారులను కొనుగోలు చేస్తే క్రికెట్‌ పరిభాషలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటారని, ఇలానే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ కుట్ర పన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మ్యాచ్‌ అనే ఈ ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్లు అనే అంపైర్లను మోదీయే ఎంపిక చేశారని.. రాజకీయ నాయకులనే ఇద్దరు క్రీడాకారులను (కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌)ను జైలుకు పంపారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇదే చివరి అవకాశమని, మోదీ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గనక మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేసి, ప్రజల హక్కులను కాలరాస్తుందని హెచ్చరించారు. రాజ్యాంగం లేకపోతే రిజర్వేషన్లూ పోతాయని... పేదలు, రైతులు, శ్రామికుల సంపద అంతా దేశంలోని ఓ ఐదారుగురు బడా వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుక అని, ఒకవేళ రాజ్యాంగం ఖతమైతే దేశం వేర్వేరు రాజ్యాలుగా మరోసారి ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరెన్‌ల అరెస్టును నిరసిస్తూ విపక్ష ‘ఇండియా కూటమి’ ఆదివారం ఢిల్లీలోని రామ్‌ లీలా మైదాన్‌లో ప్రజాస్వామాన్ని పరిరక్షణ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఖర్గే, సోనియా, రాహుల్‌, శరద్‌ పవార్‌, అఖిలేశ్‌, సీతారాం ఏచూరి సహా 27 విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ‘‘ఇవేం ఎన్నికలు? డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారు. రాజకీయ నేతలను బెదిరిస్తున్నారు. సొరెన్‌, కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ముగ్గురు-నలుగురు బిలియనీర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ద్వారా గెలవాలని మోదీ అనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. పోలీసులు, సీబీఐ, ఈడీ బెదిరింపుల ద్వారా దేశాన్ని నడిపించగలం అని మోదీ అనుకుంటున్నారని, మీడియాను కూడా కొనుగోలు చేశారని కానీ ప్రపంచంలో ఏ శక్తీ భారత ప్రజల గొంతు నొక్కలేదని హెచ్చరించారు. బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెబుతోందని.. ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ లేకుండా... మీడియాను కొనకుండా, ఈవీఎంలను వాడకుంటే కమలం పార్టీ కనీసం 180 స్థానాలను కూడా గెలవలేదని పేర్కొన్నారు.

ఐక్యత లేకపోతే విజయం సాధించలేం

బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ కాలకూటవిషం లాంటివని, వారు దేశాన్ని ధ్వంసం చేశారని, మరింత విధ్వంసం సృష్టించేందుకు ఇక ఎంతమాత్రం అనుమతించరాదని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉంటేనే బీజేపీని ఓడించడం సాధ్యపడుతుందని, తద్విరుద్ధంగా విపక్ష పార్టీలే తమలో తాము పోట్లాడుకుంటే విజయం సాధించలేమని హెచ్చరించారు. అధికారం కోల్పోతామన్న భయంతో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నేతలంతా ఢిల్లీలో ఉండటం చూసి.. ప్రధాని ఢిల్లీ విడిచి వెళ్లారని ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించి చందాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తనపైనే కాకుండా తన తండ్రి, తల్లి, చెల్లెళ్లపైనా కేసులు మోపారని, అయితే తాము సింహాలమని, ఎవ్వరికీ భయపడబోమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు. దేశంలో ఒకే వ్యక్తిచేతిలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, సంకీర్ణ ప్రభుత్వమే దేశానికి సరైందని ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని పీడీపీ నేత ముఫ్తీ చెప్పారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు.

రాముడి నుంచి మోదీ తెలుసుకోవాలి

బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఎన్ని అడ్డంకులు కల్పించినా ఇండియా కూటమి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. తాను చిన్నప్పటి నుంచీ రామలీలా మైదాన్‌కు వచ్చి రావణుడిని దగ్ఢం చేస్తుంటే చూసేదాణ్ని అని గుర్తు చేసుకున్నారు. అరెస్టయిన నేతలను విడిచిపెట్టి, నిష్పాక్షిక విచారణ జరిపించాలనే ప్రతిపక్ష కూటమి డిమాండ్లను ఆమె చదివి వినిపించారు.

ఇండియా కూటమి తరఫున ఎన్నికల కమిషన్‌కు ప్రియాంకా గాంధీ చేసిన ఐదు డిమాండ్లు ఇవే!

లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు ప్రభుత్వానికి, విపక్షాలకు సమాన అవకాశాలు ఉండేలా ఎన్నికల కమిషన్‌ భరోసా ఇవ్వాలి.

ఎన్నికలను ప్రభావితం చేసేందుకు విపక్షాలపై కేంద్రం ప్రయోగిస్తున్న ఐటీ, సీబీఐ, ఈడీ అస్త్రాలను ఈసీ ఆపివేయాలి.

హేమంత్‌ సొరెన్‌, కేజ్రీవాల్‌ను తక్షణమే విడుదల చేయాలి.

విపక్షాల ఆర్థికంగా చిదిమివేసే పరిస్థితులను ఈసీ నిరోధించాలి.

ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా దొడ్దిదారిన బీజేపీ నిధులు సమకూర్చుకున్న వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ ఏర్పాటు చేయాలి.

నియంతృత్వం పోవాలి

కేజ్రీవాల్‌, హేమంత్‌ సొరెన్‌ అరెస్టులపై విపక్ష పార్టీల నేతలు తీవ్ర నిరసన తెలిపారు. కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌లు కూడా సభలో ప్రసంగించారు. భారత మాత గాయలతో బాధపడుతోందని, ఈ నియంతృత్వం పోవాలని సునీతా కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇండియా కూటమి ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందంటూ కేజ్రీవాల్‌ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు.

Updated Date - Apr 01 , 2024 | 04:16 AM