లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తాం
ABN , Publish Date - Apr 17 , 2024 | 02:49 AM
బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కీలక వ్యాఖ్యలు
![లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సల్మాన్ఖాన్ను కలిసిన తర్వాత మహారాష్ట్ర సీఎం శిందే కీలక వ్యాఖ్యలు
ముంబై, ఏప్రిల్ 16: బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కీలక వ్యాఖ్యలు చేశారు. తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ అంతు చూస్తామని అన్నారు. మంగళవారం ఏక్నాథ్ శిందే సల్మాన్ఖాన్ను ఆయన ఇంటి వద్ద కలిశారు. సల్మాన్తో పాటు ఆయన తండ్రి సలీంఖాన్ను కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం సల్మాన్ ఇంటి బయట విలేకరులతో మాట్లాడుతూ, సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి భద్రత కల్పిస్తామని, ఏం భయపడాల్సిన అవసరం లేదని సల్మాన్ఖాన్కు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేశామని, వారిని పూర్తిగా విచారించి దీని వెనుక ఉన్న అసలు కారకులను త్వరలో పట్టుకుంటామని అన్నారు. తాము ఎటువంటి గ్యాంగ్లను కానీ గ్యాంగ్ వార్లను కానీ సహించమని వారి అంతుచూస్తామని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను ఉద్దేశించి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు.