ఇంటి కోసం బాలుడి కిడ్నాప్.. హత్య
ABN , Publish Date - Mar 26 , 2024 | 03:12 AM
ఒక పెద్ద ఇంటిని నిర్మించాలనే అత్యాశతో డబ్బు కోసం.. ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మహారాష్ట్ర థానే బద్లాపూర్లోని గోరేగావ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది.
![ఇంటి కోసం బాలుడి కిడ్నాప్.. హత్య](https://media.andhrajyothy.com/media/2024/20240322/66_2d6b3db453.jpg)
మహారాష్ట్రలోని గోరేగావ్లో ఘోరం
థానే, మార్చి 25: ఒక పెద్ద ఇంటిని నిర్మించాలనే అత్యాశతో డబ్బు కోసం.. ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. మహారాష్ట్ర థానే బద్లాపూర్లోని గోరేగావ్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. గోరేగావ్లో దర్జీ అయిన సల్మాన్ మౌల్వీకి నూతన ఇంటిని నిర్మించడం కోసం డబ్బు అవసరమైంది. దాని కోసం తన ఇంటి పక్కన నివసించే ఇబాద్ అనే 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని పథకం రచించాడు. ఆదివారం సాయంత్రం నమాజ్కు వెళ్తున్న ఇబాద్ను కిడ్నాప్ చేసి అతని తండ్రికి కొత్త నంబర్ నుంచి ఫోన్ చేసి రూ. 23లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. భయపడిన ఇబాద్ తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెల్ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు లోకేషన్ను ట్రేస్ చేసి సల్మాన్ ఇంటికి వెళ్లి గాలించగా అతని ఇంటి వెనుక గోనె సంచిలో ఇబాద్ శవం కనిపించింది. సల్మాన్తో పాటు అతని సోదరుడు సాఫాన్ మౌల్వీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేరంలో సల్మాన్ కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.