Share News

Kejriwal : కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Jun 06 , 2024 | 05:38 AM

ఆమ్‌ ఆద్మీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహాడ్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ అనారోగ్య

Kejriwal  : కేజ్రీవాల్‌కు కోర్టులో చుక్కెదురు

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

న్యూఢిల్లీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ఆమ్‌ ఆద్మీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహాడ్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 10 నుంచి జూన్‌ 1 వరకు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 2నే ఆయన తీహాడ్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. అయితే, జైలు అధికారులు తనకు ఇన్సులిన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, దీనివల్ల బరువు తగ్గానని, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, మెడికల్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉన్నదని, అందువల్ల మరోవారం రోజులు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని ఆయన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేజ్రీవాల్‌ తరఫున న్యాయవాది వివేక్‌ జైన్‌, ఈడీ తరఫున న్యాయవాదులు ఎస్వీ రాజు, తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. గతంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మాత్రం ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధవారం న్యాయమూర్తి కావేరి భవేజా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు. ఈ నెల 7నే కేజ్రీవాల్‌ రెగ్యులర్‌ బెయిల్‌పై విచారణ జరగనుంది.

Updated Date - Jun 06 , 2024 | 05:38 AM