Karnataka: రామాయణంపై అవమానకర వ్యాఖ్యలు.. టీచర్కు కోలుకోలేని దెబ్బ
ABN , Publish Date - Feb 12 , 2024 | 09:50 PM
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక టీచర్ కాస్త నోటిదురుసు ప్రదర్శించింది. రామాయణం, మహాభారతంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆ టీచర్కి వ్యతిరేకంగా ఓ వర్గం వారు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలిపారు.
![Karnataka: రామాయణంపై అవమానకర వ్యాఖ్యలు.. టీచర్కు కోలుకోలేని దెబ్బ](https://media.andhrajyothy.com/media/2023/20231205/Teacher_Suspened_27edf88dc6.jpg)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక టీచర్ కాస్త నోటిదురుసు ప్రదర్శించింది. రామాయణం, మహాభారతంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆ టీచర్కి వ్యతిరేకంగా ఓ వర్గం వారు నిరసన చేపట్టారు. ఈ నిరసనకు ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. ఆ టీచర్ను పాఠశాల నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళూరులోని కోస్టల్ టౌన్లో ఉన్న సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హెచ్ఆర్ ప్రైమరీ స్కూల్లో ఒక మహిళ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇటీవల విద్యార్థులకు విద్యాబోధన ఇస్తున్న సమయంలో.. రామాయణం, మహాభారతం కేవలం కల్పిత గాధలేనని పేర్కొంది. అంతేకాదు.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడిందని ఆరోపణలు వచ్చాయి. 2002 గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసు గురించి ఆమె ప్రస్తావించారని తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో.. రైట్వింగ్ గ్రూప్ వాళ్లు ఆ టీచర్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పిల్లల మనసుల్లో ద్వేష భావాలను ప్రేరేపించేలా ఆ టీచర్ ప్రయత్నిస్తోందని ఆ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యే వేద్యస్ కామత్ కూడా ఆ గ్రూప్కి మద్దతు తెలిపారు.
ఆ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నిరసనలు చేపట్టారు. ఆ ఎమ్మెల్యే సైతం నిరసనల్లో పాల్గొనడంతో.. ఆ టీచర్ని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా.. ‘‘సెయింట్ గెరోసా పాఠశాలకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు. ఈ దురదృష్టకర ఘటన తాత్కాలిక అపనమ్మకాన్ని సృష్టించింది. ఆ టీచర్ని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం.. నమ్మకాన్ని పునర్నిర్మించడానికి సహాయపడుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం మేమంతా కలిసి మెరుగ్గా పని చేస్తాం’’ అంటూ ఆ పాఠశాల ఒక లేఖ విడుదల చేసింది. కాగా.. ఈ కేసుని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) దర్యాప్తు చేస్తోంది.