Share News

కన్నడనాట హోరాహోరీ!

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:49 AM

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 28 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్‌ జరగనుంది.

కన్నడనాట హోరాహోరీ!

దశాబ్దాలుగా కాంగ్రె్‌సకు కంచుకోట

బీజేపీకి దక్షిణాదిలో బలమున్న ఏకైక రాష్ట్రం

ఉనికి కోసం జేడీఎస్‌ ఆరాటం

(బెంగళూరు-ఆంధ్రజ్యోతి)

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మొత్తం 28 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్‌ జరగనుంది. ఈనెల 26న 14 నియోజకవర్గాలకు, మే 7న మరో 14 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగనుంది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా అన్ని స్థానాల్లో బరిలో ఉండగా.. బీజేపీ-జేడీఎస్‌ పొత్తుతో ముందుకెళ్తున్నాయి. బీజేపీ 25, జేడీఎస్‌ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రాబల్యం కల్గిన లింగాయత సామాజికవర్గం నేత యడియూరప్ప ద్వారా బీజేపీ రాజకీయాలు కొనసాగిస్తోంది. జేడీఎ్‌సతో పొత్తు వల్ల రెండో బలమైన సామాజికవర్గం ఒక్కలిగల మద్దతు కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రె్‌సలో సీఎం సిద్దరామయ్య బీసీ నేతగా గుర్తింపు కలిగి ఉన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఒక్కలిగ సామాజికవర్గానికి చెందినవారు. బీజేపీకి లింగాయత, ఒక్కలిగల మద్దతు ఉండగా కాంగ్రె్‌సకు బీసీ, ఒక్కలిగలతోపాటు మైనారిటీలు అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. కాంగ్రె్‌సకు అనుకున్నన్ని స్థానాలు దక్కకపోతే ముఖ్యమంత్రి మార్పు, బీజేపీకి సీట్లు తగ్గితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.

కాంగ్రె్‌సలో కలహాలు..

కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీకి కర్ణాటక కంచుకోట అనే పేరుంది. ఒకప్పుడు దేశమంతటా కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం ఉన్నా, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చిక్కమగళూరు నుంచి గెలిపించడం దీనికి తార్కాణం. రాష్ట్రం నుంచి మరో కీలక ఎన్నికల్లో బళ్లారి నుంచి బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌పై సోనియాగాంధీ విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రె్‌సలో నెలకొన్న అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకుని సత్తాచాటేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. బీజేపీకి దక్షిణాదిలో ఆధిపత్యం ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. ప్రస్తుతం 28 మంది సిటింగ్‌ ఎంపీలలో 25 మంది బీజేపీవారే. కాంగ్రెస్‌, జేడీఎ్‌సలకు ఒక్కో ఎంపీ ఉన్నారు. మండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సినీ నటి సుమలత బీజేపీకి మద్దతిస్తున్నారు. మొత్తంగా28 స్థానాల్లో బీజేపీకి 26 మంది ఎంపీలున్నారు.

మోదీ ప్రచార హోరు..

గత కొన్ని సంవత్సరాలుగా జేడీఎస్‌ ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బీజేపీతో చేతులు కలపడం ద్వారా జేడీఎస్‌ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ప్రచారంలో మోదీ కీలకంగా మారారు. ఇప్పటికే మోదీ ఆరు బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఇటీవల హిందువులపై చోటు చేసుకున్న సంఘటనలను, హుబ్బళ్లిలో విద్యార్థిని దారుణహత్యను బీజేపీ తన ప్రచారాస్ర్తాలు తెరపైకి తెస్తోంది. మోదీ శనివారం ఎన్నికల ప్రచారసభలో కూడా ఇవే అంశాలను ప్రస్తావించారు. ఇదిలా ఉండగా, ఈసారి ఎన్నికల్లో రెబెల్స్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నారు. బీజేపీ సీనియర్‌ నేత ఈశ్వరప్ప శివమొగ్గలో స్వతంత్రంగా పోటీ చేయడం, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి పోటీ చేస్తున్న ధారవాడలో ఆరు లక్షలకుపైగా ఓటర్లు కల్గిన లింగాయత సామాజికవర్గానికి చెంది న మఠాధిపతి దింగాలేశ్వరస్వామి పోటీ చేయడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్‌ పార్టీలోనూ రెబెల్స్‌ బెడద వెంటాడుతోంది. కాగా, మూడు సంస్థలు నిర్వహించిన ఎన్నికల సర్వేల్లో విభిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి.

కలిసివచ్చిన 5 గ్యారెంటీలు..

కాంగ్రెస్‌ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో ఐదు గ్యారెంటీల హామీలు బాగా కలసివచ్చాయి. వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మెరుగైన స్థానాలు వస్తాయని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ‘పే సీఎం’, 40ు కమీషన్‌ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా బీజేపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు.. కేంద్రం కర్ణాటకకు అన్నింటా ఖాళీ చెంబు చూపుతోందని వ్యంగాస్త్రాలు సంధిస్తూ ప్రకటనలిస్తోంది.

Updated Date - Apr 21 , 2024 | 03:49 AM