Share News

S Jaishankar: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై జైశంకర్ కౌంటర్ల వర్షం.. దెబ్బ పడిందిగా!

ABN , Publish Date - Mar 04 , 2024 | 04:40 PM

టూరిజం అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) చేసిన వ్యాఖ్యలకు తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు ఎప్పుడూ $4.5 బిలియన్ల సహాయాన్ని అందించరని ఆయన పేర్కొన్నారు.

S Jaishankar: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుపై జైశంకర్ కౌంటర్ల వర్షం.. దెబ్బ పడిందిగా!

టూరిజం అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) చేసిన వ్యాఖ్యలకు తాజాగా విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కౌంటర్ ఇచ్చారు. వేధించేవాళ్లు ఎప్పుడూ $4.5 బిలియన్ల సహాయాన్ని అందించరని ఆయన పేర్కొన్నారు. తాను రాసిన ‘వై భారత్ మేటర్’ అనే పుస్తక ప్రచార కార్యక్రమంలో భాగంగా జైశంకర్ మాట్లాడుతూ.. పొరుగున ఉన్న దేశాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారికి సకాలంలో సహాయం అందించడంలో భారత్ క్రియాశీల పాత్ర పోషించిందని నొక్కి చెప్పారు.

ఆ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య కాలంలో భారత్, దాని పొరుగు దేశాల మధ్య ఉన్న సంబంధాల్లో చాలా మార్పు వచ్చింది. భారత్ ఒక రౌడీ దేశంలా వ్యవహరిస్తుందని ప్రచారం జరుగుతోంది. మీకో విషయం తెలుసా? వేధించే దేశాలెప్పుడూ $4.5 బిలియన్ సహాయాన్ని అందిచవు. కొవిడ్ సమయంలో ప్రపంచ దేశాలన్ని కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఆ దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వవు. యుద్ధాల కారణంగా క్రిష్ట పరిస్థితుల్లో ఉంటే.. సొంత నిబంధనలకు మినహాయింపులు ఇచ్చుకొని మరి ఇంధనం, ఎరువులు, ఆహారం సరఫరా చేయవు’’ అని వ్యాఖ్యానించారు.


భారత్‌కు పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయని.. బంగ్లాదేశ్‌, నేపాల్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాలతో పవర్‌ గ్రిడ్‌, రోడ్లు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. జలమార్గాల వినియోగం కూడా ఉందన్నారు. ప్రస్తుతం భారత వాణిజ్య సంస్థలు బంగ్లాదేశ్‌ పోర్టులను సైతం వినియోగిస్తున్నాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులతో వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని జైశంకర్ వెల్లడించారు. ముఖ్యంగా.. భూటాన్ బలమైన భాగస్వామిగా ఉందన్నారు.

ఇదిలావుండగా.. టూరిజం విషయంలో భారత్, మాల్దీవుల (India vs Maldives) మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు ముయిజ్జు భారత్‌పై పరోక్షంగా నోరుపారేసుకున్నారు. తమది చిన్న దేశం అయినప్పటికీ, తమని బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి కూడా లేదని వ్యాఖ్యానించారు. ఇందుకు కౌంటర్‌గానే తాజాగా జైశంకర్ పైవిధంగా కౌంటర్ ఎటాక్ చేశారు. అటు.. సొంత దేశంలోనూ ముయిజ్జుకి ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. భారత్‌తో వ్యవహరిస్తున్న తీరుని మార్చుకోవాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది.

Updated Date - Mar 04 , 2024 | 04:40 PM