గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు..
ABN , Publish Date - Mar 01 , 2024 | 04:44 AM
ఆహారం దొరక్క.. కలుపు మొక్కల్ని తింటున్న గాజా వాసులపై మరో పిడుగు పడింది. ఈజిప్టు నుంచి రఫా సరిహద్దు మీదుగా గురువారం ఉదయం ఆహార సరఫరా ట్రక్కులు
104 మంది శరణార్థుల దుర్మరణం
750 మందికి తీవ్ర గాయాలు.. పిండి పంపిణీలో దారుణం
సెంట్రల్ గాజా, ఫిబ్రవరి 29: ఆహారం దొరక్క.. కలుపు మొక్కల్ని తింటున్న గాజా వాసులపై మరో పిడుగు పడింది. ఈజిప్టు నుంచి రఫా సరిహద్దు మీదుగా గురువారం ఉదయం ఆహార సరఫరా ట్రక్కులు రాగా.. పిండి కోసం ఆ వాహనాలను చుట్టుముట్టిన పాలస్తీనీయులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 104 మంది మృత్యువాత పడ్డారు. మరో 750 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. దక్షిణ గాజాలోని ‘రషీద్ స్ట్రీట్’ వద్ద మానవతాసాయం కోసం ఎదురు చూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దారుణంగా కాల్పులు జరిపిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అష్రఫ్ అల్-ఖుద్రా ఆరోపించారు. ఇజ్రాయెల్ తొలుత ఈ ఆరోపణలను ఖండించింది. పిండి పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో మరణాలు సంభవించినట్లు పేర్కొంది. మధ్యాహ్నానికి కాల్పులకు తమ వైమానికదళమే కారణమని అంగీకరించినట్లు ‘రాయిటర్స్’ ఓ వార్తను ప్రచురించింది. అయితే మరణాల సంఖ్యను 70గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్స(ఐడీఎఫ్) పేర్కొన్నట్లు తెలిపింది.