పాక్ ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి
ABN , Publish Date - Jan 17 , 2024 | 03:56 AM
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-అల్-ఆదిల్కు చెందిన రెండు కీలక స్థావరాలపై ఇరాన్ ముప్పేట
టెహ్రాన్, జనవరి 16: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-అల్-ఆదిల్కు చెందిన రెండు కీలక స్థావరాలపై ఇరాన్ ముప్పేట దాడులు జరిపింది. మంగళవారం సాయంత్రం క్షిపణులు, సూసైడ్ డ్రోన్లతో ఈ దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్రీన్మౌంటెన్ ప్రాంతంలో.. పంజ్గురు సరిహద్దులో జైష్-అల్ను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో ఆ సంస్థకు చెందిన రెండు హెడ్క్వార్టర్లు నేలమట్టమైనట్లు వెల్లడించింది. ఈ ఘటనల్లో మరణాలు కూడా భారీగా ఉండి ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఐఆర్జీసీ ఇరాక్లోని కుర్దిస్థాన్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో, సిరియాలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. జైష్-అల్-ఆదిల్ ఉగ్ర సంస్థ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో.. పకడ్బందీ వ్యూహంతో మంగళవారం దాడులు చేసినట్లు తెలుస్తోంది.