Share News

JDU leader Tyagi : ప్రధాని పదవి ఇస్తామని నితీశ్‌కు ‘ఇండియా’ ఆఫర్‌

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:54 AM

బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్‌ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఎలాంటి ఆఫర్లనూ తాము స్వీకరించేది లేదని

JDU leader Tyagi : ప్రధాని పదవి ఇస్తామని నితీశ్‌కు ‘ఇండియా’ ఆఫర్‌

జేడీయూ నేత త్యాగి

న్యూఢిల్లీ, జూన్‌ 8: బిహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్‌ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఎలాంటి ఆఫర్లనూ తాము స్వీకరించేది లేదని చెప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి నితీశ్‌కు ప్రధాని పదవిని ఆఫర్‌ చేసింది. కానీ, వచ్చే ఐదేళ్లూ ఎన్డీయేతోనే కలిసి పనిచేయాలని మేం నిర్ణయించుకొన్నాం’’ అని త్యాగి అన్నారు. తమను ఆఫర్లకు లొంగే నాయకులుగా కాంగ్రెస్‌ సహా మిత్ర పక్షాలు భావించడం బాధ కలిగించిందన్నారు. ఇండియా కూటమి కన్వీనర్‌ పోస్టుకు నితీశ్‌కు అర్హతలేదని భావించిన వారు ఇప్పుడు ప్రధాని పదవికి పనికి వస్తారని ఎలా భావిస్తున్నారని త్యాగి ప్రశ్నించారు. బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని తెలిపారు. హోదా ఇవ్వకపోతే బిహార్‌ అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. ఇదిలావుంటే, ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూకు కేంద్రంలో రెండు పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పదవులకు సీనియర్‌ నాయకుడు లలన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌ పేర్లను నితీశ్‌ కుమార్‌ సూచించినట్టు సమాచారం. వీరిలో రామ్‌నాథ్‌ ఠాకూర్‌.. భారత రత్న కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు కావడం గమనార్హం. కాగా, కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ ఖండించారు. ‘‘కూటమి విషయం పక్కన పెడితే.. కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సమాచారం లేదు’’ అని అన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 05:54 AM