మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన!
ABN , Publish Date - Jan 30 , 2024 | 02:59 AM
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు పార్లమెంటులో మెజారిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎండీపీ(మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ) సిద్ధమైంది. కేబినెట్లోకి కొత్తగా నలుగురు సభ్యులను
![మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన!](https://media.andhrajyothy.com/media/2023/20231205/2_Muizzu_27c6949d71.jpg)
మాలె, జనవరి 29: మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు పార్లమెంటులో మెజారిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎండీపీ(మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ) సిద్ధమైంది. కేబినెట్లోకి కొత్తగా నలుగురు సభ్యులను తీసుకోడానికి ఆమోదం తెలిపే విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంటులో ఘర్షణ జరిగిన తర్వాతి రోజే చైనా అనుకూల దేశాధ్యక్షుడిపై అభిశంసనకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమవడం గమనార్హం. అభిశంసన తీర్మానానికి అవసరమైనన్ని సంతకాలను డెమొక్రాట్ల భాగస్వామ్యంతో ఎండీపీ సేకరించింది. పార్లమెంటులో మొత్తం 87 మంది సభ్యులుండగా, ప్రతిపక్ష ఎండీపీ, డెమొక్రాట్లకు సంయుక్తంగా 56 మంది సభ్యుల బలముంది. పార్లమెంటులో 56 ఓట్లతో దేశాధ్యక్షుడిని అభిశంసించవచ్చని రాజ్యాంగంతోపాటు, పార్లమెంటు స్టాండింగ్ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సోమవారం ఎండీపీ పార్లమెంటరీ గ్రూప్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలనుకున్న నలుగురిలో ఒకరి నియామకానికి పార్లమెంటు సోమవారం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి అలీ హైదర్ అహ్మద్ నియామకాన్ని 37-32 ఆధిక్యంతో పార్లమెంటు ఆమోదించిందని స్థానిక మీడియా తెలిపింది. గతేడాది జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఓటమి పాలయ్యారు. అనంతరం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన చైనా అనుకూల ముయిజ్జు మార్చి 15 నాటికి తమ దేశం నుంచి సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని భారత్ను కోరారు.