Share News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 04:04 AM

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా బాసగూడ అడవుల్లో బుధవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

బీజాపూర్‌ జిల్లా బాసగూడ అడవుల్లో కాల్పులు

ఆరుగురు మావోయిస్టుల మృతి

మృతుల్లో డిప్యూటీ కమాండర్‌ నగేశ్‌, సోనీ

జంట.. తుపాకులు, కిట్‌ బ్యాగులు స్వాధీనం

మృతుల సంఖ్య పెరిగే అవకాశం: పోలీసులు

చింతూరు/సాలూరు రూరల్‌/చర్ల, మార్చి 27: ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా బాసగూడ అడవుల్లో బుధవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో పీఎల్‌జీఏ బాసగూడ ఏరియా 10వ ప్లాటూన్‌ డిప్యూటీ కమాండర్‌ పూనెం నగేశ్‌ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో పూనెం నగేశ్‌ భార్య సోనీతోపాటు మరో మహిళా మావోయిస్టు ఉన్నారు. రెండు రోజుల క్రితం బీజాపూర్‌ జిల్లా బాసగూడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ మావోయిస్టుల కోసం బుధవారం ఉదయం బాసగూడ అడవుల్లో డీఆర్‌జీ 229, కోబ్రా 205, 210, సీఎఆర్‌ఐపీయూ 168 బలగాలు గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో బలగాలు బాసగూడలోని దక్షిణ వైపు ఉన్న చీపురుభట్టి, తాలిపేరు నది పరిసర ప్రాంతాలకు చేరుకోగానే మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతులను పూనెం నగేశ్‌తోపాటు (ఐదులక్షల రివార్డు), పీఎల్‌జీఏ బాసగూడ ఏరియా 10వ ప్లాటూన్‌ సభ్యుడు పూనెం ఐతు (రెండు లక్షల రివార్డు), ప్లాటూన్‌ సభ్యురాలు, నగేశ్‌ భార్య వెట్టి సోనీ(రెండు లక్షల రివార్డు), యాక్షన్‌ టీం కమాండర్‌ వికాష్‌, జేగెరు కొండ ఏరియా కమిటీ సభ్యుడు కోవాసి గంగి, (ఐదు లక్షల రివార్డు), మిలీషియా సెక్షన్‌ కమాండర్‌ నుప్పో మోకాగా గుర్తించినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజన్‌ తెలిపారు. వీరిలో పూనెం నగేశ్‌, కోవాసి గంగిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు, పూనెం ఐతు, వెట్టి సోనీపై రూ.2 లక్షల చొప్పున.. ఆరుగురిపై కలిపి రూ.14 లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు సంబందించిన మందుగుండు సామగ్రి, వాకీటాకీలు, రెండు టిఫిన్‌ బాంబులు, కార్డెక్స్‌ వైర్లు, యూనిఫాం, విప్లవ సాహిత్య పుస్తకాలు, జిలెటిన్‌ స్టిక్స్‌, తుపాకులు, కిట్‌బ్యాగులు, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును పరిశీలిస్తే.. మావోయిస్టులే కవ్విపు చర్యలకు పాల్పడి ఆ ఉచ్చులో వారే ఇరుక్కున్నారని కొందరు సీనియర్‌ పోలీస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని చెబుతున్నారు. కాగా, వరుస ఎన్‌కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది పలు ఘటనల్లో ఇప్పటివరకు 37 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 30న బీజాపూర్‌ జిల్లా బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి మోహన్‌ పేరుతో మంగళవారం లేఖ విడుదలైంది.

Updated Date - Mar 28 , 2024 | 04:04 AM