చైనా సరిహద్దులకు భారీగా బలగాలు
ABN , Publish Date - Mar 09 , 2024 | 03:20 AM
పొరుగు దేశాలను రెచ్చగొట్టడం, అవి ప్రతీకార చర్యలకు పాల్పడితే బెదిరింపులకు దిగడం చైనాకు అలవాటుగా మారింది.
![చైనా సరిహద్దులకు భారీగా బలగాలు](https://media.andhrajyothy.com/media/2024/20240306/aa_28459d67f5.jpg)
ఎల్ఏసీ వెంబడి 10వేల మంది మోహరింపు
న్యూఢిల్లీ, మార్చి 8: పొరుగు దేశాలను రెచ్చగొట్టడం, అవి ప్రతీకార చర్యలకు పాల్పడితే బెదిరింపులకు దిగడం చైనాకు అలవాటుగా మారింది. గత నాలుగేళ్లుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం భారీగా దళాలను మోహరించింది. ఇప్పుడు భారత్ కూడా బలగాలను పెంచుతుండటం దానికి కంటగింపుగా మారింది. భారత్ చర్యలు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడంలో ఏమా త్రం తోడ్పడవని చైనా విదేశాంగ శాఖ తాజా గా వ్యాఖ్యలు చేసింది. కాగా, సరిహద్దులను పటిష్ఠం చేసేందుకు భారత్ వేలాది మంది సైనికులను మోహరించింది. గతంలో పశ్చిమ సరిహద్దులో మోహరించిన 10వేల మంది సైనికులతో కూడిన ఒక యూనిట్ను చైనాతో సరిహద్దులో కొంత భాగానికి కాపలాగా నియమించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వివాదాస్పద చైనా సరిహద్దు కోసం తొలుత నియమించిన 9వేల మంది సైనికుల బృందం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన పోరాట కమాండ్ పరిధిలోకి రానుంది. ఈ ఏకీకృత దళం ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల నుంచి చైనాను విభజించే 532 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కాపాడుతుంది.