నేవీ మాజీ చీఫ్ రాందాస్కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
ABN , Publish Date - Mar 17 , 2024 | 05:45 AM
భారత నౌకాదళ మాజీ అధిపతి అడ్మిరల్(రిటైర్డ్) లక్ష్మీనారాయణ్ రాందాస్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గ వాటికలో సైనిక లాంఛనాల మధ్య కుటుంబసభ్యులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఆయనకు అంతిమ
సికింద్రాబాద్, తిరుమలగిరి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళ మాజీ అధిపతి అడ్మిరల్(రిటైర్డ్) లక్ష్మీనారాయణ్ రాందాస్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని స్వర్గ వాటికలో సైనిక లాంఛనాల మధ్య కుటుంబసభ్యులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాందాస్.. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలలో భాగంగా సైనికులు ఆయన మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు తీసుకువచ్చారు. తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. అమర్ రహే.. అమర్ రహే.. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు. త్రివిధ దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు రాందాస్ పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, సామాజికవేత్త రమా మేల్కొటే, మీరా సంఘమిత్ర, రచయిత దివి కుమార్, మానవ హక్కుల వేదిక నుంచి జీవన్కుమార్ తదితర ప్రముఖులు రాందాస్కు అంతిమ వీడ్కోలు పలికారు. కాగా, 1933 సెప్టెంబరు5న ముంబైలో జన్మించిన రాందాస్.. 1953 నుంచి 1993 వరకు భారత నౌకా దళంలో వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించారు. 1971లో భారత్-పాక్ యుద్ధంలోనూ నౌకాదళ అధికారిగా కీలక పాత్ర పోషించారు. అందుకుగాను భారత ప్రభుత్వం ఆయన్ను వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది. 1990 జనవరి 30న 13వ భారత నౌకాదళ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన రాందాస్ నేవీలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.