Share News

Former CM: కొవిడ్, స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిపాలైన మాజీ ముఖ్యమంత్రి

ABN , Publish Date - Feb 03 , 2024 | 10:10 PM

రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి, తాము అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా తగిన పద్ధతులు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు.

Former CM: కొవిడ్, స్వైన్‌ఫ్లూతో ఆసుపత్రిపాలైన మాజీ ముఖ్యమంత్రి

రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి కాబట్టి, తాము అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా తగిన పద్ధతులు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఓ మాజీ ముఖ్యమంత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొవిడ్‌తో పాటు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు. దీంతో.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరగా కోలుకుంటున్నారని తెలిసింది. ఇంతకీ.. ఆ మాజీ సీఎం ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. అశోక్ గెహ్లాట్.


కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న అశోక్ గెహ్లాట్.. ఇటీవల ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకున్నారు. రిపోర్ట్‌లో కొవిడ్‌పాటు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ రావడంతో.. ఆయన సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘‘గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో.. వైద్యుల సలహా మేరకు శుక్రవారం పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షలో కొవిడ్, స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో.. నేను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాను. ఈ కారణంగా.. ఏడు రోజుల పాటు ఎవరితోనూ కలవలేను’’ అని ట్వీట్ చేశారు. అలాగే.. మారుతున్న ఈ వాతావరణంలో మీరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండని అశోక్ గెహ్లాట్ ప్రజల్ని సూచించారు.

సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ మాట్లాడుతూ.. జ్వరంతో పాటు తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ కారణంగా అశోక్ గెహ్లాట్ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌లో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని, చింతించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Updated Date - Feb 03 , 2024 | 10:10 PM