Share News

ప్రయోగశాలలో చేప మాంసం!

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:56 AM

సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎ్‌ఫఆర్‌ఐ) ప్రయోగశాలలో చేప మాంసం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారి. దేశంలో సముద్ర ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో

ప్రయోగశాలలో చేప మాంసం!

తయారీకి సీఎంఎఫ్‌ఆర్‌ఐ సంకల్పం

అదే రంగు, రుచి, పోషక విలువలు

ప్రైవేటు సంస్థతో ఒప్పందం

ఈ రంగంలో ముందంజ వేసిన

దేశాలతో పోటీ పడే యత్నం

కోచి, జనవరి 29 : సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎ్‌ఫఆర్‌ఐ) ప్రయోగశాలలో చేప మాంసం తయారీ దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారి. దేశంలో సముద్ర ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు చేపట్టారు. తద్వారా సముద్ర ఉత్పత్తులపై ఆధారపడడంతగ్గుతుందని, అలాగే దేశం కల్చర్డ్‌ మెరైన్‌ ఫిష్‌ మీట్‌(సముద్ర చేపల మాంసం) తయారీ రంగంలో ముందడుగు వేస్తుందని సోమవారం విడుదల చేసిన సీఎంఎ్‌ఫఆర్‌ఐఅధికారిక ప్రకటన వెల్లడించింది. చేపల్లోని ప్రత్యేక కణాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పెంచడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇలా ఉత్పత్తి చేసిన మాంసం అసలు చేప మాంసం రంగు, రుచి, పోషక విలువలే కలిగి ఉంటుంది. తొలిదశలో ఖరీదైన కింగ్‌ ఫిష్‌, పాంఫ్రెట్‌, సీర్‌ ఫిష్‌ వంటి చేపల మాంసం తయారుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు నీట్‌ మీట్‌ బయోటెక్‌ స్టార్టప్‌ సంస్థతో సీఎంఎ్‌ఫఆర్‌ఐ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. సీఎంఎ్‌ఫఆర్‌ఐ డైరెక్టర్‌ ఎ. గోపాలకృష్ణన్‌, నీట్‌ మీట్‌ బయోటెక్‌ సీఈవో సందీప్‌ శర్మ ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం ఖరీదైన సముద్ర చేపల కణజాలం అభివృద్ధిపై సీఎంఎ్‌ఫఆర్‌ఐ దృష్టి సారిస్తుంది. ఈ కణజాలం నుంచి చేప మాంసం తయారీకి కావాల్సిన సాంకేతికతతో నీట్‌ మీట్‌ తదుపరి ప్రక్రియలను చేపట్టి సదరు చేప మాంసం తయారుచేస్తుంది. ఈ రంగంలో ఇప్పటికే ముందున్న సింగపూర్‌, ఇజ్రాయెల్‌, యూఎస్‌ వంటి దేశాలతో పోటీ పడేందుకు ఈ ఒప్పందం కీలకమైందని గోపాలకృష్ణన్‌ అన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 02:56 AM