Share News

నైనిటాల్‌లో కార్చిచ్చు

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:28 AM

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక చర్యల కోసం జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది.

నైనిటాల్‌లో కార్చిచ్చు

నైనిటాల్‌లో కార్చిచ్చు

36 గంటలుగా మండుతున్న అడవి.. 31 చోట్ల మంటలు

  • రంగంలోకి వైమానిక దళం, సైన్యం

న్యూఢిల్లీ, నైనిటాల్‌, ఏప్రిల్‌ 27: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలోని అడవిలో 36 గంటలుగా చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు భారత వైమానిక దళం, భారత ఆర్మీ రంగంలోకి దిగాయి. అగ్నిమాపక చర్యల కోసం జిల్లా యంత్రాంగం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది.
నైనిటాల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెలరేగిన అగ్నికీలలు పైన్స్‌ ప్రాంతానికి సమీపంలో ఉన్న హైకోర్టు కాలనీ వరకు వ్యాపించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పైన్స్‌ పమీపంలో ఉన్న పాత, ఖాళీ ఇంటిని మంటలు చుట్టుముట్టాయని ఆ ప్రాంతానికి చెందిన వాసి, హైకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ అనిల్‌ జోషి తెలిపారు. అయితే దీనివల్ల హైకోర్టు కాలనీకి ఎలాంటి నష్టం జరగలేదు కానీ, భవనాల సమీపంలో అగ్నికీలలు
ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. కాగా, పైన్స్‌ సమీపంలో ఉన్న భారత ఆర్మీ స్థావరాలకు కూడా మంటలు చేరువయ్యాయి. వాటిని అదుపు చేయడానికి భారత వైమానిక దళం ఎంఐ-17 వి5 హెలికాప్టర్‌ ద్వారా బాంబి బకెట్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. దీనికోసం భీమ్‌ తాల్‌ సరస్సు నుంచి నీటిని తీసుకెళ్లింది.
అగ్ని ప్రమాదం కారణంగా నైనిటాల్‌ జిల్లా యంత్రాంగం నైని సరుస్సులో బోటింగ్‌ను నిషేధించింది. కేంద్ర బలగాలతో కలిసి 40 మంది అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి మాట్లాడుతూ.. ‘ఇదొక భారీ అగ్ని ప్రమాదం.
అడవిలో చెలరేగిన మంటలను అదుపు చేయడం మాకు సవాల్‌గా మారింది. దీనికోసం ఆర్మీ సాయం కోరాం. సాధ్యమైనంత త్వరగా మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నారు. నైనిటాల్‌ అడవిలో చెలరేగిన మంటలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలను సీఎం ధామి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

ఇదిలా ఉండగా ఈ నెల 26న రుద్రప్రయాగ్‌లో అడవులకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో భూమియాధర్‌, జ్యోలికోట్‌, నారాయణ్‌ నగర్‌, భవాలి, రామ్‌గఢ్‌, ముక్తేశ్వర్‌ ప్రాంతాల్లోని అడవుల్లో గత 24 గంటల్లో 31 చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.

దీనివల్ల 33.34 హెక్టార్ల అటవీ భూమి దగ్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది నవంబరు 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 575 అగ్నిప్రమాదాలు సంభవించగా 689.89 హెక్టార్లలో అటవీ ప్రాంతం దెబ్బతింది.

అడవుల్లో కార్చిచ్చు కొత్తేమీ కాదు..

అడవుల్లో మంటలు చెలరేగడం బారత్‌లో కొత్తేమీ కాదు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ అటవీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేనంత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొండప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు చెలరేగే అవకాశం ఎక్కువ. గతేడాది ఫితోర్‌గఢ్‌ జిల్లాలో చెలరేగిన మంటలు.. అటవీ సంపదకు తీవ్ర నష్టం కలిగించాయి.

ప్రస్తుతం నైనిటాల్‌లో 36 గంటలుగా చెలరేగుతున్న కార్చిచ్చు.. గతంలో భారత్‌లో సంభవించిన అగ్నిప్రమాదాలను గుర్తుకుతెచ్చింది. 2024 ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 2023లోనూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 95 అడవుల్లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని అడవుల్లో 2023 మార్చిలోనే 96 అగ్నిప్రమాదాలు సంభవించాయి. 2022 నుంచి 2023 వరకు అటవీ ప్రాంతాల్లో 871చోట్ల మంటలు చెలరేగాయి.

ప్రముఖ పర్యాటక కేంద్రమైన గోవాలో 2023లో 348 హెక్టార్ల అటవీభూమి దగ్ధమైంది. 2019లో కర్ణాటకలోని బందీపూర్‌ అడవుల్లో కార్చిచ్చు చెలరేగి 3 వేల హెక్టార్లు దగ్ధమైంది.

Updated Date - Apr 28 , 2024 | 07:19 AM