కృత్రిమ మేథతో పిండం వయసు నిర్ధారణ
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:46 AM
గర్భిణీ స్త్రీల కడుపులోని పిండం వయస్సును కచ్చితంగా నిర్ధారించే కృత్రిమ మేథ నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
![కృత్రిమ మేథతో పిండం వయసు నిర్ధారణ](https://media.andhrajyothy.com/media/2024/20240224/22_27b44e763a.jpg)
ఏఐ నమూనాను అభివృద్ద్ధి చేసిన ఐఐటీ మద్రాస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: గర్భిణీ స్త్రీల కడుపులోని పిండం వయస్సును కచ్చితంగా నిర్ధారించే కృత్రిమ మేథ నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. భారత్ తరఫున ఈ తరహా ఏఐ మోడల్ను రూపొందించడం ఇదే తొలిసారి. గర్భిణుల సంరక్షణకు, ప్రసవ తేదీలను కచ్చితంగా నిర్ణయించడానికి సరైన ‘గర్భధారణ వయస్సు’ (గెస్టేషనల్ ఏజ్) అవసరం. ‘గర్భిణి-జీఏ2’గా పిలిచే ఈ ఏఐ నమూనాను భారత జనాభా డేటాను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది పిండం వయస్సును కచ్చితంగా అంచనా వేస్తుందని, దీనివల్ల తప్పులు జరిగే అవకాశాలు మూడు రెట్లు తగ్గుతాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ జీఏ2 మోడల్తో ప్రసూతి వైద్యులు మెరుగైన సంరక్షణ అందించేందుకు వీలవుతుందని.. తద్వారా భారత్లో మాతా శిశు మరణాల రేటు తగ్గుతుందని చెప్పారు.