Share News

వేగంగా దేశాభివృద్ధి బీజేపీకే సాధ్యం

ABN , Publish Date - Jan 18 , 2024 | 03:15 AM

దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, దేశ భవిష్యత్తుపై బీజేపీకి స్పష్టమైన దృక్పథం ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని

వేగంగా దేశాభివృద్ధి బీజేపీకే సాధ్యం

తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి: మోదీ'

కొచ్చి/త్రిసూర్‌, జనవరి 17: దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని, దేశ భవిష్యత్తుపై బీజేపీకి స్పష్టమైన దృక్పథం ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. బుధవారం కేరళలోని కొచ్చిలో సుమారు 6 వేల మంది పోలింగ్‌ బూత్‌ల ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళలో ఎల్డీఎఫ్‌, యూడీఎ్‌ఫల చరిత్ర అవినీతిమయమని ఓటర్లకు వివరించాలని చెప్పారు. కాగా, కొచ్చిలో రూ.4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. వీటిలో కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో దేశంలో అతి పెద్దదైన ‘డ్రై డాక్‌’ ఒకటి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ డ్రై డాక్‌తో పాటు పాటు ప్రారంభించిన ఓడల నిర్మాణం, మరమ్మతుల యూనిట్‌, ఎల్పీజీ దిగుమతి టెర్మినల్‌ దక్షిణాదిలో అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. మోదీ కేరళలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గురువాయూర్‌ శ్రీకృష్ణుడి ఆలయం, త్రిప్రయర్‌ శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. గురువాయూర్‌ ఆలయంలో మలయాళ నటుడు, బీజేపీ నేత సురేశ్‌ గోపి కుమార్తె వివాహానికి మోదీ హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించి వరమాలలు అందించారు. వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ వేడుకకు మోహన్‌లాల్‌, మమ్ముట్టి, జయరాం, ఖుష్బూ తదితర నటులు కూడా హాజరయ్యారు.

Updated Date - Jan 18 , 2024 | 03:15 AM