EVM : ఈవీఎం హ్యాక్ చేశారు!
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:07 AM
ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సంచలన వార్త వెలుగు చూసింది. ఈవీఎంలకు అనుసంధానించిన మొబైల్ ఫోన్ను ఉపయోగించారనే ఆరోపణలపై ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి తాజాగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్, ఆయన బంధువులపై

మొబైల్ ఫోన్, ఓటీపీతో అన్లాక్
ముంబై, జూన్ 16: ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సంచలన వార్త వెలుగు చూసింది. ఈవీఎంలకు అనుసంధానించిన మొబైల్ ఫోన్ను ఉపయోగించారనే ఆరోపణలపై ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం నుంచి తాజాగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్, ఆయన బంధువులపై కేసు నమోదైంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో శివసేనకు చెందిన రెండు వర్గాలు ఈ స్థానం నుంచి పోటీ చేయగా ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన రవీంద్ర 48 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇప్పడు ఆయన గెలుపుపై వివాదం నెలకొంది. జూన్ 4న ఇక్కడి నెస్కో పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంను అన్లాక్ చేయడానికి రవీంద్ర బావమరిది మంగేశ్ పాండిల్కర్ మొబైల్ ఫోన్ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఆ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. మంగేశ్పై కేసు నమోదు చేశారు.
అవకతవకలకు ఆస్కారం లేదు: ఆర్వో
ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, కట్టుదిట్టమైన రక్షణతో కూడిన స్వతంత్ర వ్యవస్థ వాటిలో ఉందని ముంబై ఎన్నికల అధికారులు ఆదివారం స్పష్టం చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంకు అనుసంధానమైన మెబైల్ ఫోన్ను ఉపయోగించి రవీంద్ర వాకర్ 48ఓట్ల స్పల్ప మెజారిటీతో గెలుపొందారంటూ కథనాలు రావడంపై ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానం రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ స్పందించారు. ‘ఈవీఎం ఒక స్టాండ్ అలోన్ వ్యవస్థ. దాన్ని అన్లాక్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు. ఇది ప్రోగ్రామింగ్ చేసిన యంత్రం కాదు. అలాగే ఇది ఎలాంటి వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను కలిగి ఉండదు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన పత్రికకు నోటీసులు జారీ చేశాం’ అని సూర్యవంశీ మీడియాకు వెల్లడించారు.