చూపు లేకున్నా.. మానవతా సాయం
ABN , Publish Date - Mar 12 , 2024 | 02:49 AM
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న యువతికి రెండు కళ్లూ కనిపించని ఓ వ్యక్తి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.
![చూపు లేకున్నా.. మానవతా సాయం](https://media.andhrajyothy.com/media/2024/20240306/qq_8b3a11881a.jpg)
క్యాన్సర్ బాధితురాలికి లక్ష ఇచ్చిన తిరుపతి వాసి
‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందన
తిరుపతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న యువతికి రెండు కళ్లూ కనిపించని ఓ వ్యక్తి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. విజయవాడలోని కేదారేశ్వరపేటకు చెందిన కొర్లగంటి దేవి అమృత(20) బీటెక్ విద్యార్థిని. ఇటీవల ఆమె బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డారు. బోన్ మ్యారో చికిత్సకు రూ.60 లక్షల వరకు ఖర్చు పెట్టే స్థోమత లేక ఆ పేద కుటుంబం తల్లడిల్లుతోంది. దీనిపై ‘అమృత’ హస్తం అందించండి! శీర్షికన ఈ నెల 9వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితమైంది. తిరుపతి నగరం మంగళం క్వార్టర్స్లో నివాసముంటున్న శ్రీనివాసులు నాయుడు కుటుంబీకుల ద్వారా ఈ వార్తను తెలుసుకుని చలించిపోయారు. సుమారు నలభై ఏళ్లపాటు రేషన్ షాపు డీలరుగా పనిచేసి పొదుపు చేసిన మొత్తం నుంచి లక్ష రూపాయలను సోమవారం బాధితురాలి బ్యాంకు ఖాతాకు ఆయన జమ చేశారు. కాగా, శ్రీనివాసులు నాయుడు పదేళ్ల వయసులో చెట్టుపై నుంచి కింద పడడంతో తలలో నరాలు దెబ్బతిని రెండు కళ్లూ కనిపించకుండా పోయాయని ఆయన కుమారుడు జ్యోతికృష్ణ చెప్పారు. చూపు లేకపోయినప్పటికీ తన తండ్రి మానవతా సాయానికి ముందుంటారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా తోచిన సాయం చేస్తుంటారని వివరించారు.