కవితను విచారించిన ఈడీ
ABN , Publish Date - Mar 18 , 2024 | 03:39 AM
మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ..
![కవితను విచారించిన ఈడీ](https://media.andhrajyothy.com/media/2024/20240313/fh_765b578623.jpg)
స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా
ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర... ముడుపులపై ప్రశ్నలు
కవితతో ఆమె భర్త అనిల్, కేటీఆర్, హారీశ్ భేటీ
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుధీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం పదిగంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈడీ డిప్యూటీ డైరక్టర్ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ఈ విచారణ జరిపారు. మద్యం కుంభకోణానికి సంభందించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్ములాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం. అలాగే.. ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కవిత వాంగుల్మాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. కాగా.. కస్టడీలో కవితను రోజూ కుటుంబసభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించడంతో ఆమె భర్త అనిల్కుమార్, కేటీఆర్, హరీశ్రావు ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్రెడ్డి, జీవన్రెడ్డి, కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు ఉన్నారు. అయితే అధికారులు అనిల్, కేటీఆర్, హరీశ్ను మాత్రమే లోనికి అనుమతించారు. వారు కవితతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అధికారుల దర్యాప్తు తీరు గురించి వారు కవిత వద్ద ఆరా తీసినట్లు సమాచారం. అలాగే.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఆమెను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం పిటిషన్ వేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కానీ, గతంలో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండడంతో అదేరోజు కోర్టు దృష్టికి తీసుకెళితే సరిపోతుందన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వారు బయటికి వచ్చి.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.