నీట్-యూజీ పరీక్షను రద్దు చేయొద్దు
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:05 AM
వివాదాస్పదమైన నీట్-యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను ఆదేశించాలని కోరుతూ గుజరాత్కు చెందిన 56 మంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకు ‘నీట్’లో అర్హత సాధించిన గుజరాత్ విద్యార్థులు
న్యూఢిల్లీ, జూలై 4: వివాదాస్పదమైన నీట్-యూజీ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను ఆదేశించాలని కోరుతూ గుజరాత్కు చెందిన 56 మంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లలో నీట్కు అర్హత సాధించిన వారితో పాటు ఫస్ట్ ర్యాంకు పొందిన వారూ ఉన్నారు. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ చేసిన వారు, దానికి సహకరించిన వారు, అలాగే అన్యాయమైన పద్ధతులను అనుసరించి పరీక్ష రాసిన వారిని విచారణ జరిపి గుర్తించి కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని కూడా పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. అవకతవకల నేపథ్యంలో నీట్ను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని కోరుతూ దాఖలైన 26 పిటిషన్లపై ఈనెల 8న అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో.. గుజరాత్ విద్యార్థులు కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించడం వల్ల అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.