Share News

ఐక్య రాజ్య సమితికి అన్నదాతలు

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:13 AM

పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణ మాఫీ, అన్నదాతలకు పింఛన్లు తదితర డిమాండ్లతో ఉవ్వెత్తున సాగుతున్న రైతు ఉద్యమం ఐక్య రాజ్య సమితికి చేరింది.

ఐక్య రాజ్య సమితికి అన్నదాతలు

డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని విన్నపం.. పంజాబ్‌, హరియాణా హైకోర్టు సీరియస్‌

పిటిషన్‌ను వాపస్‌ తీసుకోవాలని సూచన.. రైతుల భారత్‌ బంద్‌ పాక్షికం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణ మాఫీ, అన్నదాతలకు పింఛన్లు తదితర డిమాండ్లతో ఉవ్వెత్తున సాగుతున్న రైతు ఉద్యమం ఐక్య రాజ్య సమితికి చేరింది. రైతుల పక్షాన ఈ విషయంలో జోక్యం చేసుకుని డిమాండ్ల పరిష్కారానికి సహకరించాలని పిటిషనర్‌ ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌.. ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియోకు లేఖ రాశారు. అయితే, దీనిపై పంజాబ్‌, హరియాణా కోర్టు సీరియస్‌ అయింది. ‘‘ఇదేం పద్ధతి.. రైతుల డిమాండ్ల విషయంలో జోక్యం చేసుకుని సహకరించాలని హైకోర్టును ఆశ్రయించారు. సంబంధింత అంశం మా పరిశీలనలో ఉంది. అది విచారణలో ఉండగానే ఐక్య రాజ్య సమితిని ఎలా ఆశ్రయిస్తారు..?’’ అని తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సంధావాలియా, జస్టిస్‌ లాపితా బెనర్జీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐక్య రాజ్య సమితిలో వేసిన పిటిషన్‌ను వాపస్‌ తీసుకోవాలని హైకోర్టు కోరగా.. పిటిషనర్‌ అంగీకరించారు. కాగా, రైతుల ఆందోళనకు సంబంధించి రెండు పిటిషన్లపై పంజాబ్‌, హరియాణా హైకోర్టులో విచారణ నడుస్తోంది. ఇందులో ఒకటి హరియాణాలో ఇంటర్నెట్‌ నిషేధం, సరిహద్దుల మూసివేతపై.. మరొకటి.. ఆందోళన చేస్తున్న రైతులు రహదారులను దిగ్బంధించడంపై కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. గురువారం ఈ అంశాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐరాస విషయం తెలిసి సీరియస్‌ అయింది.

నాలుగో రోజూ కొనసాగిన ఆందోళనలు..

పంజాబ్‌, హరియాణా, యూపీ రైతులు చేస్తున్న ఆందోళనలు నాలుగో రోజూ కొనసాగాయి. అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల్లోని బ్యారికేడ్ల దిశగా కదిలిన రైతులను చెదరగొట్టేందుకు హరియాణా పోలీసులు టియర్‌ గ్యాస్‌ను వదిలారు. శంభూ వద్ద ఆందోళనలో పాల్గొన్న వృద్ధుడు(78) గుండెపోటుతో మరణించాడు. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా నిలవాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు దేశవ్యాప్తంగా పలు పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అయితే బంద్‌ పాక్షికంగా జరిగింది. పంజాబ్‌, హరియాణాలో మాత్రమే బంద్‌ తీవ్రత కనిపించింది. కాగా, రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు మూడు సార్లు విఫలం కావడంతో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..మంత్రులు అర్జున్‌ ముండా, గోయల్‌తో సమావేశమయ్యారు. రైతుల డిమాండ్లపై చర్చిందుకు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతలు ఆదివారం నాలుగో దఫా సమావేశం కానున్నారు.

Updated Date - Feb 17 , 2024 | 03:13 AM