కేంద్ర మంత్రిపై డీఎంకే ఎంపీల దుర్భాషలు!
ABN , Publish Date - Feb 07 , 2024 | 04:06 AM
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు లోక్సభలో స్వరాష్ట్రానికే చెందిన ఓ కేంద్రమంత్రిని దుర్భాషలాడడం కలకలం రేపింది. దళిత మంత్రిని అవమానించారంటూ బీజేపీ విరుచుకుపడింది.
![కేంద్ర మంత్రిపై డీఎంకే ఎంపీల దుర్భాషలు!](https://media.andhrajyothy.com/media/2023/20231205/oo_8a83c5a83a.jpg)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: డీఎంకే ఎంపీ టీఆర్ బాలు లోక్సభలో స్వరాష్ట్రానికే చెందిన ఓ కేంద్రమంత్రిని దుర్భాషలాడడం కలకలం రేపింది. దళిత మంత్రిని అవమానించారంటూ బీజేపీ విరుచుకుపడింది. వరదలతో అతలాకుతలమైన తమిళనాడు పునర్నిర్మాణానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుందని మంగళవారం సభలో డీఎంకే ఎంపీలు రాజా, గణేశమూర్తి నిలదీశారు. తర్వాత టీఆర్ బాలు మాట్లాడుతుండగా.. తమిళనాడుకే చెందిన కేంద్ర సహాయమంత్రి మురుగన్ జోక్యం చేసుకుని.. డీఎంకే సభ్యులు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని ఆక్షేపించారు. దీనిపై బాలు మండిపడ్డారు. ‘క్రమశిక్షణ నేర్చుకో.. నీకు పార్లమెంటు సభ్యుడిగా ఉండే అర్హత లేదు. కేంద్ర మంత్రిగా ఉండే యోగ్యతా లేదు. మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం నీకు లేదు. నీకు గుణపాఠం నేర్పుతాం’ అన్నారు.