Share News

‘ఆమ్‌’ ఆద్మీ..!

ABN , Publish Date - Apr 19 , 2024 | 04:17 AM

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌.. బెయిల్‌ పొందేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరోపించింది. ఆయనకు మధుమేహం ఉండడంతో మామిడి,

‘ఆమ్‌’ ఆద్మీ..!

బెయిల్‌ కోసం కేజ్రీవాల్‌ మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారు

ఢిల్లీ సీఎంపై కోర్టులో ఈడీ ఆరోపణలు

ఇన్సులిన్‌ ఇవ్వడం లేదు.. ఆయనను చంపే కుట్ర: ఆతిషి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌.. బెయిల్‌ పొందేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆరోపించింది. ఆయనకు మధుమేహం ఉండడంతో మామిడి, అరటి పండ్లు, మిఠాయిలు తింటూ చక్కెర స్థాయిలను పెంచుకుని తద్వారా అనారోగ్యాన్ని సాకుగా చూపి బెయిల్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. టైప్‌2 మధుమేహ రోగి అయినందున తన వ్యక్తిగత వైద్యుడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్‌... రౌజ్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ అభ్యర్థనను ఈడీవ్యతిరేకించింది. మధుమేహ రోగులు తినకూడని ఆహారాన్ని కేజ్రీవాల్‌ తింటున్నారని, ఆయన తెప్పించుకుంటున్న ఆహారంలో మామిడి పండ్లు, మిఠాయిలు ఉంటాయని.. చక్కెర వేసిన టీని తాగుతారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బెయిల్‌ కోసం అప్పీల్‌కు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన తీసుకుంటున్నవన్ని వైద్యుడు సూచించినవేనని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది వివేక్‌ జైన్‌ తెలిపారు. ఇంటి భోజనాన్ని నిలిపివేసేందుకు ఈడీ సాకులు చెబుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ భోజనంతోపాటు ఆయన ఆహార పట్టికపై పూర్తి నివేదిక శుక్రవారంలోపు ఇవ్వాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించిన కోర్టు విచారణను ఇదేరోజుకు వాయిదా వేసింది. కాగా సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్‌ మంత్రి ఆతిషి ఆరోపించారు. పలుమార్లు అభ్యర్థించినప్పటికీ ఇన్సులిన్‌ను ఇవ్వలేదన్నారు. కేజ్రీవాల్‌కు తీవ్రమైన మధుమేహం ఉందని అందరికీ తెలుసని, ఆయన చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్‌ తీసుకుంటారని చెప్పారు. కానీ ఈడీ ద్వారా బీజేపీ కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని పాడుచేయాలనుకుంటోందని ఆరోపించారు.

జైలు అధికారుల నుంచి నివేదిక కోరిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌

తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ అందించడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాల నివేదికను 24 గంటల్లోగా సమర్పించాలని జైళ్ల డైరెక్టర్‌ జనరల్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గురువారం ఆదేశించారు. సీఎం ఆరోగ్యం విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హామీ ఇస్తున్నట్టు రాజ్‌ నివాస్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.

Updated Date - Apr 19 , 2024 | 04:17 AM