Share News

Highway in China border: డ్రాగన్‌ దూకుడుకు చెక్‌!

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:52 AM

అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వెంబడి 1,748 కి.మీ. మేర వ్యూహాత్మక హైవే నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ సుమారు రూ.16 వేల కోట్లు మంజూరు చేసింది. అలాగే, భారత్‌-టిబెట్‌-చైనా-మయన్మార్‌ సరిహద్దుకు సుమారు 20 కి.మీ. దూరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే(ఎన్‌హెచ్‌913) నిర్మించనున్నారు. వీటి నిర్మాణంతో సరిహద్దు ప్రాంతాల అనుసంధానం మెరుగవనుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు.

Highway in China border: డ్రాగన్‌ దూకుడుకు చెక్‌!

సరిహద్దులో రూ.16 వేల కోట్లతో వ్యూహాత్మక హైవే

1,748 కి.మీ నిర్మించనున్న భారత్‌

సరిహద్దులో 663 గ్రామాల ఏర్పాటుకు భారత్‌ ప్రణాళిక

న్యూఢిల్లీ, బీజింగ్‌, మార్చి 13: అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సరిహద్దు వెంబడి 1,748 కి.మీ. మేర వ్యూహాత్మక హైవే నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ సుమారు రూ.16 వేల కోట్లు మంజూరు చేసింది. అలాగే, భారత్‌-టిబెట్‌-చైనా-మయన్మార్‌ సరిహద్దుకు సుమారు 20 కి.మీ. దూరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే(ఎన్‌హెచ్‌913) నిర్మించనున్నారు. వీటి నిర్మాణంతో సరిహద్దు ప్రాంతాల అనుసంధానం మెరుగవనుందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల దిశగా జరుగుతున్న వలసలను అరికట్టడం, అలాగే పొరుగుదేశాల నుంచి వలసవచ్చేవారిని తిప్పి పంపడం తప్పనిసరి’ అన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు నదీ పరీవాహక ప్రాంతాల అనుసంధానంతోపాటు, పలు జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ రోడ్లు దోహదపడనున్నాయని చెప్పారు. ఆమోదం పొందిన రోడ్డు నిర్మాణాలకు ప్రభుత్వ హైవే సంస్థలు త్వరలో బిడ్‌ల ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది జూలై, ఆగస్టు నాటికి పనులు ప్రారంభిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, సరిహద్దు ప్రాంతాల్లో సైనిక బలగాలను భారీగా మోహరించే పనులను చైనా కొనసాగిస్తుండటం వల్ల భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక హెచ్చరించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కోవర్టు కార్యక్రమాలను డ్రాగన్‌ విస్తరిస్తోందని అమెరికా వార్షిక ముప్పు అంచనా నివేదిక-2024 తెలిపింది. డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌(డీఎన్‌ఐ) ఈ నివేదికను విడుదల చేసింది. ఇది భారత్‌, చైనా మధ్య సాయుధ పోరుకు దారితీసే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవాధీన రేఖ వెంబడి క్సియాఓకాంగ్‌ గ్రామంలో సైనిక మోహరింపులను చైనా పెంచేస్తోందని ఆ నివేదిక తెలిపింది.

అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇటీవల ప్రారంభించిన సేలా సొరంగమార్గానికి కేవలం 3 కి.మీ.్ల దూరంలో భారత్‌కూ అలాంటి రక్షణ గ్రామం ఉందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అమెరికా గుర్తించింది. ఈ ప్రాంతంలో భారత్‌ కూడా మిలటరీ కార్యక్రమాలను బలోపేతం చేస్తోంది. దీంతోపాటు సైనిక దళాలను తక్షణమే అవసరమైన ప్రాంతానికి తరలించేలా సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పన పనులను భారత్‌ వేగవంతం చేసింది. అందులో భాగంగానే సరిహద్దు రహదారి సంస్థ(బీఆర్‌వో) 13 వేల కి.మీ. ఎత్తులో రూ.825 కోట్లతో సేలా సొరంగ మార్గాన్ని నిర్మించింది. కాగా, 2019 నుంచి సరిహద్దు వెంబడి సైనిక గ్రామాలను చైనా విస్తరిస్తోంది. తాజా నివేదిక ప్రకారం సరిహద్దు వెంబడి క్సియాఓకాంగ్‌ లాంటి 628 సైనిక గ్రామాలను చైనా ఏర్పాటుచేసింది. వీటిలో మొత్తం 2,41,835 మంది నివసిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా సరిహద్దులో 663 గ్రామాలను ఏర్పాటు చేయాలని భారత్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. కాగా, ఈనెల 9న ప్రధాని మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. చైనా తీరును భారత్‌ తీవ్రంగా ఖండించింది.

సరిహద్దు అంశమే సర్వం కాదు: చైనా

భారత్‌-చైనా సరిహద్దు అంశం ఇరుదేశాల మొత్తం ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింభించబోదని చైనా బుధవారం వ్యాఖ్యానించింది. ఇరుదేశాల మధ్య అభిప్రాయ బేధాలను తొలగించుకునేందుకు, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకొనే చర్యలకు పిలుపునిచ్చింది. అయితే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనే వరకూ చైనాతో తమ సంబంధాలు సాధారణ స్థితికి చేరబోవని భారత్‌ స్పష్టం చేసింది.

Updated Date - Mar 14 , 2024 | 07:07 AM