Share News

వీఐటీ ఛాన్స్‌లర్‌కు.. అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం

ABN , Publish Date - May 15 , 2024 | 04:09 AM

వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కె.విశ్వనాథన్‌కు అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (బింగ్‌ హాంటన్‌ యూనివర్సిటీ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

వీఐటీ ఛాన్స్‌లర్‌కు..  అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం

విద్యా రంగంలో విశేష కృషికి దక్కిన గౌరవం

చెన్నై, మే 14 (ఆంధ్రజ్యోతి): వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కె.విశ్వనాథన్‌కు అమెరికాలోని స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (బింగ్‌ హాంటన్‌ యూనివర్సిటీ) గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ నెల 10న బింగ్‌ హాంటన్‌ యూనివర్సిటీలో జరిగిన వేడుకలో వర్సిటీ ఛాన్స్‌లర్‌ హార్వే స్టింగర్‌ విశ్వనాథన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథన్‌కు ప్రత్యేక అభినందన సభ జరిగింది.

ఈ కార్యక్రమంలో అక్కడి శాసన మండలి సభ్యులు డోనా ఎలుప్పాడో, సెనేట్‌ సభ్యులు లియావెట్‌, డీన్‌ ప్రొఫెసర్‌ శ్రీహరి కృష్ణస్వామి, స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ డొనాల్డ్‌ హాల్‌, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్‌ విశ్వనాథన్‌, డాక్టర్‌ శేఖర్‌ విశ్వనాథన్‌, డాక్టర్‌ జీవీ సెల్వం, కాదంబరి విశ్వనాథన్‌, వీఐటీ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా వాషింగ్టన్‌లోనూ విశ్వనాథన్‌కు ప్రత్యేక అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సెనేట్‌ సభ్యుడు కన్నన్‌ శ్రీనివాసన్‌, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ విద్యా విభాగాధిపతి డాక్టర్‌ బి.కరుణాకరన్‌, వీఐటీ నార్త్‌ అమెరికన్‌ అలుమ్నీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌లు, తదితరులు హాజరై విశ్వనాథన్‌ను అభినందించారు. చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి పలు పదవుల ద్వారా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన విశ్వనాథన్‌.. విద్యారంగంలో చేస్తున్న విశేష కృషిని గుర్తించిన అమెరికా యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

Updated Date - May 15 , 2024 | 04:09 AM