Lok Sabha Elections: అరుణ్ గోయెల్ రాజీనామాపై సీఈసీ రాజీవ్ కుమార్ తొలి స్పందనిదే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 06:35 PM
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేయడంపై చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారంనాడు తొలిసారి స్పందించారు. ''వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఉంటే ఎన్నికల కమిషన్ దానిని గౌరవిస్తుంది'' అన్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ (Arun Goel) రాజీనామా చేయడంపై చీఫ్ ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) శనివారంనాడు తొలిసారి స్పందించారు. ''వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఉంటే ఎన్నికల కమిషన్ దానిని గౌరవిస్తుంది'' అన్నారు. 2024 ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ శనివారంనాడు ప్రకటించిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా స్పందించారు. ఎంతో గౌరవప్రదమైన టీమ్ సభ్యుడు అరుణ్ గోయెల్ అని అన్నారు.
''ఆయనతో (అరుణ్ గోయెల్) పని చేసిన ప్రతిసారి చాలా ఎంజాయ్ చేస్తూ పని చేశాను. ఏ సంస్థలోనైనా ఎవరికైనా వ్యక్తిగత అంశాలు ఉండొచ్చు. వాటి జోలికి పోరాదు. అతి సున్నితమైన వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లడం, ప్రశ్నించడం ఎంత మాత్రం సరికాదు. ఆయనకు ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉంటే ఉండొచ్చు. దానిని మనం గౌరవించాలి'' అని రాజీవ్ కుమార్ సమాధానమిచ్చారు. అరుణ్ గోయెల్ మార్చి 9న తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందు ఆయన రాజీనామా చేయడంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. కేంద్రంతో కానీ, రాజీవ్ కుమార్తో కానీ విభేదాల కారణంగానే అరుణ్ గోయెల్ రాజీనామా చేసినట్టు అనుమానించాల్సి వస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులను కొత్త ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారంనాడు నోటిఫికేషన్ జారీ చేసింది.