అయోధ్యలో బాలరాముడి విగ్రహ ఊరేగింపు రద్దు
ABN , Publish Date - Jan 10 , 2024 | 04:56 AM
అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహాన్ని ఈ నెల 17న అయోధ్య నగరమంతటా ఊరేగించాలన్న నిర్ణయాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఉపసంహరించుకుంది.
17న అయోధ్య నగరమంతటా ఊరేగించాలని తొలుత ట్రస్టు నిర్ణయం
భక్తుల నియంత్రణ కష్టమన్న అధికారులు
అయోధ్య, జనవరి 8(ఆంధ్రజ్యోతి): అయోధ్యలోని రామాలయంలో ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహాన్ని ఈ నెల 17న అయోధ్య నగరమంతటా ఊరేగించాలన్న నిర్ణయాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఉపసంహరించుకుంది. విగ్రహాన్ని దర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారిని నియంత్రించడం కష్టం అవుతుందని భద్రతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అదే రోజున విగ్రహాన్ని ‘రామజన్మభూమి’ పరిసరాల్లో ఊరేగించనుంది. రాముడు వనవాసం నుంచి అయోధ్యకు చేరిన మార్గంగా రామాయణ ఇతిహాసంలో పేర్కొన్న దారిలో పలువురు ప్రముఖులు రామోత్సవ్ యాత్ర నిర్వహించనున్నారు. ఇది రామేశ్వరం నుంచి అయోధ్య వరకు ఐదు రాష్ట్రాల గుండా 4,500 కిలోమీటర్ల మేర నెలరోజుల పాటు జరుగుతుంది. ఇదిలా ఉండగా, అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ సీజేఐ ఎన్వీ రమణకు ఆహ్వానం అందింది. మంగళవారం, వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్ ఈ మేరకు ఎన్వీరమణకు ఆహ్వాన పత్రం ఇచ్చారు.
అయోధ్య అపవిత్రమైనది: పన్నూన్
అయోధ్య రామాలయం అపవిత్రమైనదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠను వ్యతిరేకించడంతో పాటు అడ్డుకోవల్సిందిగా ముస్లింలకు పిలుపునిచ్చారు. అమృత్సర్ నుంచి అయోఽధ్యకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేయాలని, విమానాశ్రయాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ కొత్త వీడియోను విడుదల చేశారు.