Attack on ED officials : ఈడీ అధికారులపై దాడి
ABN , Publish Date - Jan 06 , 2024 | 04:17 AM
రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై..
బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు
ముగ్గురు అధికారులకు గాయాలు
మొబైల్ఫోన్లు, ల్యాప్టా్పలను లాగేసుకున్న అల్లరిమూక
800 నుంచి 1000 మంది దాకా దాడికి పాల్పడ్డారు: ఈడీ
రాజ్యాంగపరంగా తగినచర్యలు తీసుకుంటా: గవర్నర్ బోస్
రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్
కోల్కతా, జనవరి 5: రేషన్ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై.. ఆయన అనుచరులు, టీఎంసీ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. వారితోపాటు వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లపైన, అక్కడున్న మీడియాపైనా దాడి చేసి, వారి వాహనాలనూ ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లా సందేశ్ఖాలీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. రేషన్ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా 15చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు సన్నిహిత అనుచరుడిగా పేరున్న షాజహాన్ ఇల్లు కూడా వాటిలో ఒకటి. శుక్రవారం సోదాల నిమిత్తం ఈడీ బృందం అక్కడికి చేరుకునేసరికి తాళం వేసి ఉంది. తాళం తీయడం కోసం వారు షాజహాన్కు, ఆయన కుటుంబసభ్యులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ తీయలేదు. దాదాపు గంట తర్వాత.. అధికారులు ఆ ఇంటి తాళం పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు, స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని అధికారులను ఘెరావ్ చేశారు. వారిపై దాడికి దిగారు. దీంతో అధికారులు ఆటోలు, బైకులు ఇలా ఏది దొరికితే ఆ వాహనం ఎక్కి ప్రాణాలు అరచేత పట్టుకుని ఆ ప్రదేశానికి దూరంగా వెళ్లిపోయారు. 800 నుంచి 1000 మంది లాఠీలు, రాళ్లు, ఇటుకలతో ఈ దాడిలో పాల్గొన్నారని.. తమ అధికారులు ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఈడీ అధికారిక ప్రకటనలో తెలిపింది. అధికారుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టా్పలు, వారి జేబుల్లో ఉన్న డబ్బు, పర్సులను సైతం.. దాడికి పాల్పడ్డ మూక ఎత్తుకుపోయినట్టు వెల్లడించింది. ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.
గవర్నర్ ఆగ్రహం..
జరిగిన ఘటనపై బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎన్నికల ముందు జరిగే హింసగా అభివర్ణించిన బోస్.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆటవిక దాడులను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన ప్రాథమిక విధిని నిర్వర్తించడంలో విఫలమైతే.. రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ‘‘గవర్నర్గా దీనిపై తగిన చర్య తీసుకోవడానికి సంబంధించి రాజ్యంగం నాకిచ్చిన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తాను’’ అని హెచ్చరించారు. ఘటనపై కేంద్రం జోక్యం చేసుకుని, ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని విపక్ష నేత సువేందు అధికారి అభిప్రాయపడ్డారు. ఇక.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడిని దురదృష్టకరంగా అభివర్ణించింది. ఈడీ తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
పవార్ మనుమడి కంపెనీలో సోదాలు
ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ సోదరుని మనుమడు, ఆ పార్టీ ఎమ్మెల్యే రోహిత్పవార్ కంపెనీలో ఈడీ శుక్రవారం సోదాలు చేసింది. బారామతి ఆగ్రో అనే కంపెనీకి ఆయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు. కంపెనీకి సంబంధించి కనీసం ఆరు స్థలాల్లో సోదాలు జరిగాయి. మహారాష్ట్ర సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల మళ్లింపులో మనీలాండరింగ్కు పాల్పడినట్టు ఈడీ రోహిత్పవార్పై కేసు నమోదు చేసింది. మహారాష్ట్ర సహకార బ్యాంకులో రూ.25వేల కోట్ల రుణాల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు
రూ.5 కోట్ల నగదు, 5 కిలోల బరువున్న మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం
100 బాటిళ్ల విదేశీ మద్యం కూడా..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై హరియాణాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వర్ నివాసంలో ఈడీ జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారం లభ్యమైంది. సోనేపట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో అక్రమ మార్గాల ద్వారా నగదు సంపాదించారంటూ 2013లో ఈడీతో పాటు, రాష్ట్ర పోలీసులు పలు కేసులు నమోదు చేశాయి. పన్వర్ ఇళ్లల్లో రూ.5 కోట్ల నగదు, 4-5 కిలోల బరువు ఉన్న మూడు బంగారం బిస్కెట్లు, అక్రమంగా తీసుకొచ్చిన విదేశీ తుపాకులు, 300 తూటాలు, 100 బాటిళ్ల విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొంది. గురు, శుక్రవారాల్లో ఈ సోదాలు జరిగాయి. గురువారం 15-20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.