Share News

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

ABN , Publish Date - Apr 10 , 2024 | 11:21 AM

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను వారానికి రెండు సార్లు మాత్రమే కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

 CM Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (CM Arvind Kejriwal) మరో ఎదురు దెబ్బ తగిలింది. జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు (Legal Advice) తీసుకునేందుకు సమయం పెంచాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో (Rouse Avenue Special Court) పిటిషన్ (Petition) వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన లాయర్‌ను వారానికి రెండు సార్లు మాత్రమే కలిసేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం తన పిటిషన్‌లో కోరారు.

కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై మంగళవారం సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తీరును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా తప్పుబడుతూ.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయితే.. అరెస్టు చేయొద్దా? ముఖ్యమంత్రికి ప్రత్యేక హక్కులేమీ ఉండవు. లోక్‌సభ ఎన్నికల సమయాన్ని బట్టి.. ఆయన అరెస్టు గురించి కోర్టు పట్టించుకోదు. చట్టం, న్యాయం ప్రకారమే ఆయన రిమాండ్‌ను పరిశీలిస్తాం. న్యాయమూర్తులుగా మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. మా తీర్పులు న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. అంతేతప్ప.. రాజకీయాలతో మాకు పనిలేదు. మా తీర్పులు రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. కింది కోర్టు కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడం.. ఆ తర్వాత ఈడీ కస్టడీకి ఇవ్వడం.. తిరిగి జైలుకు తరలించడం.. అందుకు సంబంధించిన ఆదేశాలు సరైనవేనని ఆమె స్పష్టం చేశారు. ‘‘లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌ కుట్రదారుడని ఈడీకి లభించిన సాక్ష్యాధారాలను బట్టి వెల్లడైంది. ఈ కుంభకోణంలో లభించిన మొత్తం(డబ్బు)ను ఉపయోగించడం, దాచడం ద్వారా.. కేజ్రీవాల్‌ తన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీని కేజ్రీవాల్‌ రూపొందించారు. ముడుపులు డిమాండ్‌ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు’’ అని ఆమె గుర్తుచేశారు. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి కేజ్రీవాల్‌ చేస్తున్న ప్రయత్నాల వల్ల.. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నవారి కేసుల విచారణపైనా ప్రభావం పడుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కేజ్రీవాల్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవర్లు బీజేపీకి ఎన్నికల బాండ్లు సమర్పించడం, ఒకరికి టికెట్‌ దక్కడాన్ని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్రంలోని అధికార పార్టీ ఢిల్లీలో లబ్ధి పొందేందుకే తనను అరెస్టు చేయించిందని పేర్కొన్నారు. దీనిపైనా జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా స్పందించారు. ‘‘రాఘవ్‌ మాగుంట, శరత్‌ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారి.. మనీలాండరింగ్‌ చట్టం, సీఆర్పీసీలోని సెక్షన్‌ 164 కింద ప్రకటనలు చేశారు. అప్రూవర్లకు సంబంధించిన చట్టం వందేళ్లనాటిది. కేవలం కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు చేసిన చట్టం కాదు. అప్రూవర్ల ప్రకటనలను అనుమానించడం అంటే.. న్యాయస్థానం, న్యాయమూర్తిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లే. ఎన్నికల బాండ్లు ఎవరు కొన్నారు? ఎవరికి టికెట్‌ లభించింది? అన్నదానితో మాకు ప్రమేయం లేదు. చట్టం, న్యాయసూత్రాల మేరకే మేం పనిచేస్తాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. దర్యాప్తు ఎలా జరగాలనేదాన్ని నిర్ణయించాల్సింది నిందితుడు కాదు. ఆయన(కేజ్రీవాల్‌) సౌకర్యాలకు అనుగుణంగా దర్యాప్తు జరగదు. అప్రూవర్లపై అపనమ్మకం ఉంటే.. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసుకోవచ్చు. ఈ కేసు కేజ్రీవాల్‌కు-కేంద్రానికి మధ్య కాదు. కేజ్రీవాల్‌కు-ఈడీకి మధ్య సాగుతోంది’’ అని ఆమె స్పష్టం చేశారు.

అంతుకు ముందు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు, కేజ్రీవాల్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఎస్‌.వి.రాజు తన వాదనలను వినిపిస్తూ.. ‘‘సామాన్యుడు నేరం చేస్తే జైలుకు వెళ్లక తప్పదు. సీఎం అయినంత మాత్రాన కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకూడదా? మీరు(కేజ్రీవాల్‌) దేశాన్ని లూటీ చేస్తారు. అయితే.. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ముట్టుకోవద్దా? ఒక ఉగ్రవాది రాజకీయ నాయకుడైతే.. అతను సైనిక వాహనాన్ని పేల్చివేసినా.. ఎన్నికలున్నాయన్న కారణంతో అతణ్ని అరెస్టు చేయకూడదా?’’ అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్షులు/అప్రూవర్లు చేసిన ప్రకటనలు దర్యాప్తులో తేలుతాయని, మద్యం విధానాన్ని రూపొందించడంలో బయటి వ్యక్తుల పాత్ర ఉన్నదనేది స్పష్టంగా తేలిందని వ్యాఖ్యానించారు. ఆప్‌ కార్యకలాపాలకు ఆ పార్టీ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌ బాధ్యుడని, మనీలాండరింగ్‌ ద్వారా లబ్ధిపొందినందుకే ఆయనను ఈడీ అరెస్టు చేసిందని చెప్పారు. ‘‘ఈ స్కామ్‌లో డబ్బును చూపించనప్పుడు ఎలా అరెస్టు చేస్తారనే వాదనలో పసలేదు. డబ్బు ఎవరి నుంచి.. ఎక్కడి నుంచి.. ఎలా వచ్చిందో కనిపెట్టాం. డబ్బు ఖర్చయిపోయింది. అందుకే స్వాధీనం చేసుకోలేకపోయాం’’ అని ఆయన కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్‌ను ఈడీ న్యాయవాది ‘ఉగ్రవాది’తో పోల్చడాన్ని అభిషేక్‌ మనూ సింఘ్వీ తీవ్రంగా ఖండించారు. ‘‘సైనిక వాహనాన్ని పేల్చిన ఉగ్రవాదితో ముఖ్యమంత్రిని ఎలా పోలుస్తారు? డబ్బే లేనప్పుడు నేరం ఎక్కడ జరిగింది?’’ అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ముడుపులు ఇచ్చారనే ఆరోపణలే ఉంటే.. అవినీతి నిరోధక చట్టం కిందో.. ఆదాయపన్ను చట్టం కిందో దర్యాప్తు చేయాలని.. మనీలాండరింగ్‌ను ఈ కేసులో దూర్చారని విమర్శించారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ.. జ్యుడీషియల్‌ రిమాండ్‌ సబబేనని కేజ్రీవాల్‌ పిటిషన్‌ను కొట్టివేశారు.

Updated Date - Apr 10 , 2024 | 11:26 AM