14-18 వయసు విద్యార్థుల్లో నాలుగోవంతు మంది 2వ తరగతి పుస్తకాన్నే చదవలేకపోతున్నారు!
ABN , Publish Date - Jan 18 , 2024 | 03:02 AM
దేశంలో 14-18 సంవత్సరాల వయసు పిల్లల్లో 86.8ు మంది విద్యాసంస్థలకు వెళ్తున్నారని, అయితే, వారిలో నాలుగో వంతు(25 శాతం) మంది తమ ప్రాంతీయ భాషల్లో 2వ తరగతి పాఠ్య పుస్తకాలనే అనర్గళంగా చదవలేకపోతున్నారని
న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో 14-18 సంవత్సరాల వయసు పిల్లల్లో 86.8ు మంది విద్యాసంస్థలకు వెళ్తున్నారని, అయితే, వారిలో నాలుగో వంతు(25 శాతం) మంది తమ ప్రాంతీయ భాషల్లో 2వ తరగతి పాఠ్య పుస్తకాలనే అనర్గళంగా చదవలేకపోతున్నారని బుధవారం విడుదలైన వార్షిక విద్యా స్థితి నివేదిక(ఆసర్) వెల్లడించింది. గ్రామీణ భారతంలోని పిల్లల విద్య, అభ్యాసన స్థితిపై ఇంటింటి సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు. 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో 14-18 సంవత్సరాల వయసున్న మొత్తం 34,745 మందిని ఈ సర్వేలో సంప్రదించారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలలో లింగ వ్యత్యాసం కూడా స్వల్పంగా ఉందని నివేదిక పేర్కొంది. 11వ తరగతి, ఆపై తరగతుల్లో సగం మందికిపైగా(55.7 శాతం) ఆర్ట్స్, హ్యూమానిటీస్ కోర్సులు ఎంచుకుంటున్నట్టు పేర్కొంది. బాలురలో 36.3 శాతం మంది స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) కోర్సుల్లో చేరుతుండగా, బాలికల్లో 28.1 శాతం మంది మాత్రమే ఆ కోర్సుల్లో చేరుతున్నట్టు తెలిపింది.