44 డిగ్రీలు దాటేసింది!
ABN , Publish Date - Apr 07 , 2024 | 03:13 AM
ఇంకా మే నెల రానేలేదు. అయినా.. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శనివారం రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీలుగా నమోదయ్యాయి.
![44 డిగ్రీలు దాటేసింది!](https://media.andhrajyothy.com/media/2024/20240326/fklh_953c3d042c.jpg)
ఎండ వేడితో ఠారెత్తిన రాష్ట్రం
ఏడు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత
అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు
రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు కొనసాగనున్న వడ గాడ్పులు
విశాఖపట్నం/అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఇంకా మే నెల రానేలేదు. అయినా.. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శనివారం రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన వేడి దీనికితోడు వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రం మండిపోయింది. రాష్ట్రంలోని సగానికిపైగా మండలాల్లో వడగాడ్పులు వీచాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం రాష్ట్రంలోని 127 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 231 మండలాల్లో వడగాడ్పులు వీచాయని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు, అక్కడక్కడా 8 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. అనేకచోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రావికమతం, నందికొట్కూరు, నరసరావుపేట, భామిని, జియ్యమ్మవలస, మక్కువ, కురుపాంలలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వేసవి సీజన్లో ఒకే రోజు ఏడుచోట్ల 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదివారం 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 222 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, ఆదివారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.