Share News

కేంద్ర ఉద్యోగులకు 4% డీఏ

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:59 AM

సాధారణ ఎన్నికల ముంగిట వివిధ వర్గాలపై కేంద్రం ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గురువారం కేబినెట్‌ భేటీ అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

కేంద్ర ఉద్యోగులకు 4% డీఏ

50 శాతానికి చేరనున్న కరువు భత్యం.. జనవరి నుంచి వర్తింపు

49 లక్షల మంది ఉద్యోగులు, 67 లక్షలమంది పెన్షనర్లకు మేలు

కృత్రిమ మేధ అభివృద్ధి, పరిశోధనలకు రూ.10 వేల కోట్లతో మిషన్‌

ఉజ్వల లబ్ధిదారులకు రూ.300 రాయితీ 2025 మార్చి 31 వరకు పొడిగింపు

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు

న్యూఢిల్లీ, మార్చి 7: సాధారణ ఎన్నికల ముంగిట వివిధ వర్గాలపై కేంద్రం ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గురువారం కేబినెట్‌ భేటీ అనంతరం ఈ వివరాలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 4శాతం పెంచారు. ఏడో కేంద్ర వేతన సంఘం సిఫారసులమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డీఏ 46% ఉండగా పెంపు తర్వాత 50 శాతానికి చేరనుంది. ఈ ఏడాది జనవరి1 నుం చి ఇది అమల్లోకిరానుంది. దీంతో 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షలమంది పింఛనర్లకు లబ్ధి జరగనుంది. డీఏ పెంపుతో ఏటా ఖజానాపై రూ.12,869 కోట్ల భారం పడనుంది. మరోవైపు డీఏ పెంపు రవాణా భత్యం, క్యాంటీన్‌ అలవెన్స్‌, డిప్యుటేషన్‌ అలవెన్స్‌ 25% పెరిగాయి. ఇంటి అద్దె భత్యం శ్లాబుల వారీగా 27% నుంచి 30కి, 19 నుంచి 20కి, 9 నుంచి 10 శాతానికి చేరింది. గ్రాట్యుటీ ప్రయోజనాల పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. కాగా, కృత్రిమ మేధ (ఏఐ)లో అభివృద్ధి, పరిశోధనలకు రూ.10,372 కోట్లతో ఇండియా ఏఐ మిషన్‌ను కేంద్రం నెలకొల్పనుంది. ఈ నిధులతో ఐదేళ్లలో ప్రభుత్వం-ప్రైవేటు భాగస్వామ్యంతో యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్‌ మౌలిక వసతులను కల్పించనున్నారు. ఉజ్వల పథకం కింద నిరుపేద మహిళలకు అందిస్తున్న రూ.300 రాయితీని కేంద్రం వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగించారు. పది కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకంతో రూ.12 వేల కోట్ల భారం పడనుంది. ఇక ఈశాన్య భారత్‌లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు ‘ఉన్నతి’ పేరిట రూ.10,037 కోట్లతో పారిశ్రామికాభివృద్ధి పథకాన్ని ప్రకటించింది. ముడి జనపనార మద్దతు ధరను క్వింటాకు రూ.285 పెంచారు. దీంతో క్వింటా ధర రూ.5,335కు చేరనుంది. గోవా అసెంబ్లీలో షెడ్యూల్‌ తెగ (ఎస్టీ)లకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. కాగా ఐదోతరం స్టెల్త్‌ ఫైటర్‌ విమానాలకు సంబంధించి డీఆర్‌డీఓ ప్రతిపాదనను భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించింది. దీనికి రూ.15 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. సైన్యం, కోస్ట్‌ గార్డుకు కొత్తగా 34 ధ్రువ్‌ హెలికాప్టర్లు సమకూర్చే ప్రతిపాదనకూ కమిటీ ఆమోదం తెలిపింది.

Updated Date - Mar 08 , 2024 | 08:57 AM