కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెంపు
ABN , Publish Date - Oct 17 , 2024 | 06:39 AM
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. కరువు భత్యం (డీఏ) 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఆరు రబీ
పెరిగిన ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర
గోధుమలకు క్వింటాలుకు అదనంగా రూ.150
న్యూఢిల్లీ, అక్టోబరు 16: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. కరువు భత్యం (డీఏ) 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర పెంపునకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తాజా పెంపుతో ఇప్పటివరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరింది. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచే అమలు చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.9,448 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని డీఏను కేంద్రం ఏటా రెండుసార్లు సవరిస్తూ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో డీఏను 4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో ప్రధాన పంట అయిన గోధుమల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.150 పెంచింది. దీంతో రూ.2,275 నుంచి రూ.2,425కు పెరిగింది. అత్యధికంగా ఆవాలకు రూ.300 పెంచారు. దీంతో రూ.5,650 నుంచి 5,950కు పెరిగింది. మసూర్ పప్పునకు రూ.275, ఇతర పప్పు ధాన్యాలకు రూ.210, పొద్దుతిరుగుడుకు రూ.140, బార్లీకి రూ.130 పెంచారు. రైతుల ఆదాయం పెంచేందుకు రబీ పంటల మద్దతు ధర పెంచామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.