Share News

గ్రానైట్‌ క్వారీ కూలి 27 మంది మృతి

ABN , Publish Date - May 29 , 2024 | 04:10 AM

రీమల్‌ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్‌ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు.

గ్రానైట్‌ క్వారీ కూలి 27 మంది మృతి

క్వారీలో చిక్కిన మరికొందరు

మిజోరాంలో ‘రీమల్‌’ బీభత్సం

భారీ వర్షాలకు పలుచోట్ల

కూలిన కొండ చరియలు

ఎన్‌హెచ్‌ 6పై రాకపోకలకు

అంతరాయం లాంగ్‌ నదికి వరదలు

ఐజ్వాల్‌, మే 28: రీమల్‌ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్‌ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండచరియలు ఇళ్లపై కూలి 10 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. గ్రానైట్‌ క్వారీ నుంచి 17 మృతదేహాలను వెలికితీసినట్లు మిజోరం డీజీపీ అనిల్‌ శుక్లా తెలిపారు. మరో 6, 7 మంది అందులో చిక్కుకున్నట్లు భావిస్తున్నామన్నారు. భారీ వర్షాలతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోందని, రాష్ట్రంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, పలువురు గల్లంతయ్యారని ఆయన చెప్పారు. కాగా గ్రానైట్‌ క్వారీ ఘటనలో మృతి చెందిన వారిలో నాలుగేళ్ల బాలుడు, 6 ఏళ్ల బాలిక కూడా ఉన్నా రు. ఇద్దరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఐజ్వాల్‌ జిల్లాలోని చాన్‌పుయ్‌ ప్రాంతంలో కొండచరియ ఇంటిపై కూలడంతో ఒకే కుటుంబంలోని 8 మంది కనిపించకుండాపోయారు. ఆరో నెంబరు, 54వ నెంబరు జాతీయ రహదారులపైనా కొండచరియలు కూలడంతో మిజోరం రాజధాని ఐజ్వాల్‌కి మిగిలిన దేశంతో రోజంతా సంబంధాలు తెగిపో గా సాయంత్రానికి ట్రాఫిక్‌ని పునరుద్దరించారు.

పలు రాష్ట్ర రహదారులపైనా కొండచరియలు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 150 ఇళ్లు దెబ్బతిన్నాయి. 50కి పైగా ఇళ్లు నీట మునిగాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు మిజోరం సీఎం లాల్‌ధుమా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. క్వారీలో మృతి చెందిన వారికిరూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలందించే శాఖల ఉద్యోగులు తప్ప మిగిలిన విభాగాల వారుఇంటి వద్ద నుంచే పనిచేసుకోవచ్చని ప్రకటించారు. కాగా ఐజ్వాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో టిలాంగ్‌ నది వరదలతో ముంచెత్తుతుండడంతో ఓ గ్రామంలోని 50కి పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐజ్వాల్‌ పట్టణంలో శ్మశానాలపై కొండ చరియలు కూలి 150 సమాధులు దెబ్బతిన్నాయి.

Updated Date - May 29 , 2024 | 04:10 AM