Share News

22,217 ఐదేళ్లలో జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్లు

ABN , Publish Date - Mar 14 , 2024 | 05:39 AM

ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు తెలుపుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి..

22,217 ఐదేళ్లలో జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్లు

వాటిలో 22,030 బాండ్లను వివిధ రాజకీయ

పార్టీలు నగదు రూపంలోకి మార్చుకున్నాయి

మిగతా సొమ్ము పీఎం సహాయ నిధికి జమ

సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎస్‌బీఐ

ఎస్‌సీబీఏ అధ్యక్షుడు రాష్ట్రపతికి రాసిన

లేఖను ఖండించిన అసోసియేషన్‌ సభ్యులు

ఎస్‌బీఐ నుంచి బాండ్ల వివరాలు అందాయి

వాటిని గడువులోగా ప్రచురిస్తాం: సీఈసీ

న్యూఢిల్లీ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలు తెలుపుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి.. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 2024 ఫిబ్రవరి 15 వరకూ.. 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్టు అందులో వెల్లడించింది. వాటిలో 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నట్టు తెలిపింది. ఏ ఎలక్టోరల్‌ బాండ్‌ను ఎవరు కొన్నారు? ఏ రోజు కొన్నారు? దాని విలువ ఎంత? అనే వివరాలన్నింటినీ సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరచినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ ఫిబ్రవరి 15న తాము ఇచ్చిన తీర్పు అమలుపై తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ ఎస్‌బీఐ చైర్మన్‌, ఎండీ అఫిడవిట్‌ దాఖలు చేయాలంటూ సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈమేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖారా ఈ అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. తాము జారీ చేసిన ఎలక్టోరల్‌ బాండ్లను ఏ పార్టీ, ఏ తేదీన నగదు గా మార్చుకుందనే వివరాలను ఈసీకి సమర్పించిన ట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దానిప్రకారం.. 2019 ఏప్రిల్‌1 నుంచి ఏప్రిల్‌11 నడుమ 3,346 ఎన్నికల బాండ్లు జారీ చేయగా వాటిలో 1,609 బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకోగా..

2019 ఏప్రిల్‌12 నుం చి 2024 ఫిబ్రవరి15 నడుమ 18,871 బాండ్లు జారీకాగావాటిలో 20,421 బాండ్లను పార్టీలు నగదు చేసుకున్నాయి. ఎలక్టోరల్‌ బాండ్లను పొందిన రాజకీయ పార్టీలు వాటిని 15రోజుల్లోగా నగదుగా మార్చుకోకుం టే ఆమొత్తం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు.. పార్టీలు నగదుగా మార్చుకోని 187బాండ్లను రిడీమ్‌ చేసి పీఎం జాతీయ సహాయనిధికి జమచేసినట్టు ఎస్‌బీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా.. ఎలక్టోరల్‌ బాండ్లు రాజ్యాంగవిరుద్ధమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలంటూ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఆదిష్‌ సి అగర్వాలా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాయడాన్ని బార్‌ అసోసియేషన్‌ ఖండించింది. అధ్యక్షుడు అలా లేఖ రాయడానికి తామె లాంటి అధికారమూ ఇవ్వలేదని.. అందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలను తాము సమర్థించట్లేదని అందులో తేల్చిచెప్పింది. ఆదిష్‌ సి అగర్వాలా లేఖ.. సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించేలా ఉందని, దాన్ని తాము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా ఎస్‌బీఐ నుంచి ఎన్నికల బాండ్ల వివరాలు అందాయని, వాటిని సుప్రీం ఆదేశాల మేరకు నిర్ణీతసమయంలోగా తమ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్‌ జమ్ములో తెలిపారు.

Updated Date - Mar 14 , 2024 | 05:39 AM