20 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:20 AM
ఉన్నత స్థాయిలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంగన్వాడీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి దాదాపు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ మునిసిపల్ కమిషనర్లపై కేసు నమోదైంది.
![20 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అంగన్వాడీల్లో ఉద్యోగాలంటూ ముని సిపల్ చైర్మన్, కమిషనర్ కీచక పర్వం
జైపూర్, ఫిబ్రవరి 11: ఉన్నత స్థాయిలో ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంగన్వాడీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి దాదాపు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ మునిసిపల్ కమిషనర్లపై కేసు నమోదైంది. రాజస్థాన్లోని సిరోహిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సిరోహి మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్ మహేంద్ర మేవాడా, అప్పటి మునిసిపల్ కమిషనర్గా ఉన్న మహేంద్ర చౌదరిపై కేసులు నమోదు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ చాలామంది మహిళలకు ఇద్దరు నిందితులు ఆశ జూపారు. ఈ క్రమంలోనే నమ్మి వచ్చిన 20 మందికి కొన్నాళ్ల పాటు ఓ చోట భోజన వసతితో పాటు ఆశ్రయం కల్పించారు. వీలు చిక్కినప్పుడల్లా ఆహారంలో మత్తు మందు పెట్టి ఒక్కొక్కరిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ వీడియోలు కూడా తీశారు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బాధితులను బెదిరిస్తూ లైంగికంగా వాడుకోవడంతో పాటు రూ.లక్షలకు లక్షలు డిమాండ్ చేశారు. దీనిపై పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. డీఎస్పీ పరాస్ చౌదరి కేసు నమోదు చేయకుండా తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. దీంతో ఆ మహిళ సహా 8 మంది బాధితులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించి విచారణలు కొనసాగుతున్నాయి.