Share News

Lok Sabha Polls: టోల్‌ బాదుడుకు 2 నెలల విరామం

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:11 AM

జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Lok  Sabha Polls: టోల్‌ బాదుడుకు 2 నెలల విరామం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: జాతీయ రహదారులపై టోల్‌ ఫీజు (Toll Fee) పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలోనే గతంలో ఎన్నడూలేని విధంగా పెంపుదలను నిలిపివేస్తూ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. గత వారమే కేంద్రం ఈ మేరకు ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈసీ ఆమేరకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా జాతీయ రహదారులపై టోల్‌ ధరలు ప్రతి ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి పెరుగుతాయి. అయితే టోల్‌ ఫీ పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయాలంటూ స్థానిక ప్రాజెక్టు డైరెక్టర్లు మార్చి 30వ తేదీన మౌఖికంగా టోల్‌ నిర్వహణ సంస్థలను ఆదేశించారు. దీనిపై హైవే డెవలపర్స్‌ ఆర్గనైజేషన్‌, జాతీయ హైవే బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఆదివారం స్పందించాయి. ‘ఎటువంటి కారణం చెప్పకుండా పెంపుదలను నిలిపివేయాలంటూ జారీ చేసిన మౌఖిక ఉత్తర్వులు గందరగోళానికి దారితీస్తాయి. స్పష్టత కోసం అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి. పెంపుదలను రెండు నెలలపాటు నిలిపివేయడంతో వచ్చే నష్టాన్ని ఎన్‌హెచ్‌ఏఐ భర్తీ చేస్తుందంటూ ఇచ్చిన హామీని కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలి’ అంటూ ఎన్‌హెచ్‌ఏఐకి ఓ లేఖ రాశాయి.

మేమూ రెడ్లమే.. జగన్‌‌ను మళ్లీ గెలిపిస్తే..?

ఒక వాహనానికి ఒకటే ఫాస్ట్‌ట్యాగ్‌

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఒక వాహనానికి ఒకటే ఫాస్ట్‌ట్యాగ్‌ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ ఒక ఫాస్ట్‌ట్యాగ్‌ను అనేక వాహనాలకు వాడుతున్నారు. అలాగే ఒక వాహనానికి అనేక ట్యాగ్‌లను కూడా వాడుతున్నారు. దీని వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టోల్‌గేట్ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకు సాగాలన్న లక్ష్యంతో కేంద్రం ‘ఒక వాహనం... ఒక ఫాస్ట్‌ట్యాగ్‌’ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 09:19 AM