సిద్దరామయ్యకు 10 వేలు ఫైన్
ABN , Publish Date - Feb 07 , 2024 | 04:01 AM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జలవనరులశాఖ మంత్రి ఎంబీ పాటిల్, రవాణాశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్
![సిద్దరామయ్యకు 10 వేలు ఫైన్](https://media.andhrajyothy.com/media/2023/20231205/mm_beb9e39544.jpg)
2022 నాటి కేసులో విధించిన కోర్టు
బెంగళూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, జలవనరులశాఖ మంత్రి ఎంబీ పాటిల్, రవాణాశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ రణదీ్పసింగ్ సుర్జేవాలాకు హైకోర్టు రూ.10వేల చొప్పున జరిమానా విధించింది. మార్చి 6న ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. కాంట్రాక్టర్ సంతో్షపాటిల్ ఆత్మహత్య కేసులో అప్పటి బీజేపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్పను అరెస్టు చేయాలన్న డిమాండ్తో 2022లో బెంగళూరులోని రద్దీ ప్రదేశంలో అనుమతి తీసుకోకుండా వీరు ధర్నా చేశారు. తద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. పిటిషన్ను రద్దు చేయాలని సిద్దరామయ్య తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పోరాటాలు సహజమేనన్న న్యాయవాదుల వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించేవి ప్రజా పోరాటాలు ఎలా అవుతాయని ప్రశ్నించింది. కాగా, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు 42వ ఏసీఎంఎం కోర్టు నగర హైగ్రౌండ్ పోలీసులను ఆదేశించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రను అవహేళన చేస్తూ డీకే శివకుమార్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ ఐటీ విభాగం దాఖలు చేసిన పిటీషన్పై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.