Share News

India - Russia: భారత్ నుంచి రష్యాని దూరం చేస్తామంటూ అమెరికా బెదిరింపులు..?

ABN , Publish Date - Feb 11 , 2024 | 05:28 PM

భారత్, రష్యా మధ్య ఎంతో బలంగా ఉన్న స్నేహపూర్వక సంబంధాల్ని అణగదొక్కడానికి.. రెండు దేశాల మధ్య దూరం పెంచడానికి పాశ్చాత్య దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా.. రెండు దేశాలను విభజించే లక్ష్యాన్ని అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తోందని కుండబద్దలు కొట్టింది.

India - Russia: భారత్ నుంచి రష్యాని దూరం చేస్తామంటూ అమెరికా బెదిరింపులు..?

భారత్, రష్యా మధ్య ఎంతో బలంగా ఉన్న స్నేహపూర్వక సంబంధాల్ని అణగదొక్కడానికి.. రెండు దేశాల మధ్య దూరం పెంచడానికి పాశ్చాత్య దేశాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా.. రెండు దేశాలను విభజించే లక్ష్యాన్ని అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తోందని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు.. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ వ్యాఖ్యానించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల నుంచి భారత్, రష్యా దేశాలు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయని.. బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపారు. భారత్‌లో రష్యా ఎంతో నమ్మకమైన, చిత్తశుద్ధి కలిగిన, స్నేహితుడిగా ఘనమైన ఖ్యాతిని పొందిందని తెలిపారు.


పాశ్చాత్య దేశాల తరహాలో కాకుండా రష్యా ఎప్పుడూ రాజకీయాల్లో షరతులు పెట్టలేదని, దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని డెనిస్ తెలిపారు. భారత్‌తో ఎల్లప్పుడూ గౌరవప్రదమైన, విశ్వసనీయ సంబంధాలను మాత్రమే కొనసాగించిందని చెప్పారు. రష్యా నుంచి భారత్‌ని దూరం చేసే లక్ష్యాన్ని అనుసరిస్తున్నామని అమెరికా అధికారులు నేరుగా చెప్పడానికి కూడా వెనుకాడరని, సెకండరీ ఆంక్షలు విధిస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి.. భారతీయ భాగస్వాములు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతేడాది రష్యా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గుణాత్మకంగా రూపాంతరం చెందాయని.. 2024లోనూ సానుకూల పరిణామాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అనేక రంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్రమంగా విస్తరిస్తూనే ఉన్నాయని.. వాణిజ్య, ఆర్థిక సహకారం తారాస్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్లపై కూడా డెనిస్ అలిపోవ్‌ స్పందించారు. యూఎన్‌ఎస్‌సీలో స్థానం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే.. పేద దేశాల (గ్లోబల్‌ సౌత్‌) అభివృద్ధికి తోడ్పడుతుంద్నారు. భారత్‌కు ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం లేదని.. అయినప్పటికీ గతంలో తాత్కాలిక సభ్యత్వంతో భద్రతా మండలికి రెండు సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని.. జీ20 సభ్య దేశాలను ‘ఢిల్లీ డిక్లరేషన్‌’ వేళ ఏకతాటిపై నడిపించడమే దాని సమర్థతకు నిదర్శనమని అన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 05:28 PM