Share News

Dog Meat: కొత్త చట్టం.. కుక్క మాంసం తింటే, తప్పదు భారీ మూల్యం

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:52 PM

మన భారతదేశంలో శునకాలకు ఉన్న ప్రాధాన్యం వేరు కానీ.. విదేశాల్లో మాత్రం కుక్క మాంసాన్ని బాగా తింటారు. ముఖ్యంగా.. దక్షిణ కొరియాలో అయితే కుక్క మాంసం ఎన్నో శతాబ్దాల నుంచి వినియోగంలో ఉంది. ఇక్కడ మనం బిర్యానీ తిన్నట్టుగా..

Dog Meat: కొత్త చట్టం.. కుక్క మాంసం తింటే, తప్పదు భారీ మూల్యం

Dog Meat: మన భారతదేశంలో శునకాలకు ఉన్న ప్రాధాన్యం వేరు కానీ.. విదేశాల్లో మాత్రం కుక్క మాంసాన్ని బాగా తింటారు. ముఖ్యంగా.. దక్షిణ కొరియాలో అయితే కుక్క మాంసం ఎన్నో శతాబ్దాల నుంచి వినియోగంలో ఉంది. ఇక్కడ మనం బిర్యానీ తిన్నట్టుగా.. వాళ్లు కుక్క మాంసాన్ని ఇష్టంగా లాగించేస్తారు. అయితే.. క్రమంగా కుక్క మాంసం తినడం తగ్గుముఖం పట్టడం, అక్కడి ప్రజల్లో కుక్కలపై ప్రేమ పెరుగుండటంతో.. దక్షిణ కొరియా పార్ల‌మెంట్ ఒక కీల‌క చ‌ట్టాన్ని రూపొందించింది. కుక్క మాంసం వినియోగాన్ని నిషేధిస్తూ.. ఓ బిల్లును ఆమోదించింది. మంగళవారం జాతీయ అసెంబ్లీలో ఈ బిల్లుకు 208-0 ఓట్ల తేడాతో ఆమోదం ద‌క్కింది. ఈ తీర్మానంపై దక్షిణ కొరియా అధ్య‌క్షుడు యూన్ సుక్ యోల్ సంత‌కం చేయ‌నున్నారు.

అయితే.. ఈ కొత్త చట్టం మూడేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈలోపు కుక్క మాంసం పెంపకందారులు, రెస్టారెంట్ య‌జ‌మానులు ప్ర‌త్యామ్నాయ వ‌న‌రుల‌ను అన్వేషించుకోవాల‌ని.. వీరికి ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చింది. మూడేళ్ల గ్రేడ్ పీరియడ్ తర్వాత.. అంటే 2027 నాటికి కుక్క‌ల్ని చంప‌డం, బ్రీడింగ్ చేయ‌డం, అమ్మ‌కాలు వంటివి అక్రమం కానున్నాయి. ఒక‌వేళ 2027 త‌ర్వాత ఎవ‌రైనా కుక్కని చంపినా, దాన్ని మాంసాన్ని వినియోగించినా.. వాళ్లకు మూడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధిస్తారు. లేకపోతే 30 మిలియన్ వాన్ ($22,800) జరిమానా విధించడం జరుగుతుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ‘యానిమల్ ప్రొటెక్షన్ గ్రూప్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్’ (హెచ్‌ఎస్‌ఐ) సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లు మానవ వినియోగం కోసం కుక్కల పెంపకాన్ని, చంపడాన్ని అంతం చేస్తుందని పేర్కొంది. కుక్కల్ని చంపే పరిశ్రమ నుంచి మిలియన్ల కొద్దీ కుక్కల్ని రక్షించే కీలక స్థితికి చేరుకున్నామని ఆనందం వ్యక్తపరిచింది.


నిజానికి.. ఈ డాగ్ మీట్ నిషేధాన్ని అడ్డుకోవడం కోసం రైతులు ఎంతగానో ప్రయత్నించారు. తమ జీవనాధారం ఇదే కాబట్టి.. దీన్ని బ్యాన్ చేస్తే తమ పరిస్థితి ఏంటని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే.. మూడేళ్లు గడువు ఇవ్వడం, ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పడంతో, రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. గత ప్రభుత్వాలు కుక్క మాంసాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చాయి. కానీ.. ఆ విషయంలో పురోగతి సాధించలేకపోయాయి. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీలు జంతు ప్రేమికులు. ఈ జంట వద్ద ఆరు కుక్కలు ఉన్నాయి. కుక్కలను తినే పద్ధతికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని వీళ్లు గతంలోనే పిలుపునిచ్చారు. ఎట్టకేలకు తాము చెప్పినట్టుగానే కుక్క మాంసాన్ని నిషేధించారు. ఈ కొత్త చట్టం జంతు హక్కుల విలువలను ప్రోత్సాహిస్తుందని.. మానవులు, జంతువుల మధ్య సామరస్యపూర్వక సహజీవనం కొనసాగించేందుకు దోహదపడుతుందని చెప్తున్నారు.

అయితే.. ఈ బిల్లు పాస్ అవ్వడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఒక రైతు సంఘం నాయకుడు మాట్లాడుతూ.. ఇది స్పష్టమైన రాష్ట్ర హింస అని, వృత్తిపరమైన ఎంపిక స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. కాబట్టి.. తాము ఈ వ్యవహారంలో ఊరికే కూర్చోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ బ్యాన్‌పై కొరియన్ అసోసియేషన్ ఆఫ్ ఎడిబుల్ డాగ్స్ (పెంపకందారులు అమ్మకందారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ) కూడా మాట్లాడుతూ.. ఈ నిషేధం 3,000 రెస్టారెంట్లతో పాటు 1.5 మిలియన్ కుక్కలను పెంచడంలో కృషి చేసిన 3,500 ఫారమ్‌లపై ప్రభావం చూపుతుందని వాదించింది.

Updated Date - Jan 09 , 2024 | 06:12 PM