ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక ముందడుగు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:17 AM
బ్రిక్స్ సదస్సు జరిగిన కజాన్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య చర్చలకు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిలో గొప్ప ప్రాముఖ్యత ఉందని చైనా అభివర్ణించింది.

మోదీ-జిన్ పింగ్ సమావేశంపై చైనా స్పందన
బీజింగ్, అక్టోబరు 24: బ్రిక్స్ సదస్సు జరిగిన కజాన్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య చర్చలకు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిలో గొప్ప ప్రాముఖ్యత ఉందని చైనా అభివర్ణించింది. దేశాధినేతల సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని వివరించింది. సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇద్దరు నేతలు ముఖ్యమైన ప్రాథమిక అవగాహనలకు వచ్చారని, ఇది మళ్లీ స్థిరమైన అభివృద్ధి మార్గంలో నడిపేలా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం బీజింగ్లో మీడియాతో మాట్లాడారు. భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని, ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాల ప్రయోజనాల ప్రాతిపదికన మరింత ఎత్తుకు తీసుకెళ్తామన్నారు. కాగా, మోదీ-జిన్ పింగ్ మధ్య చర్చలు ఫలించాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇది చర్చల ప్రాముఖ్యతను చాటుతోందన్నారు.