Share News

Hyderabad: లైక్‌, సబ్ స్క్రైబ్.. రూ.49.45 లక్షలు గాయబ్‌...

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:35 PM

నగర యువతి నుంచి రూ. 49.59 లక్షలు కొల్లగొట్టారు సైబర్‌ కేటుగాళ్లు. అడిషనల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌(Additional CP AV Ranganath) తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో నగర యువతికి ఒక గుర్తు తెలియని వ్యక్తి టెలీగ్రామ్‌ యాప్‌లో పరిచయమయ్యాడు.

Hyderabad: లైక్‌,  సబ్ స్క్రైబ్.. రూ.49.45 లక్షలు గాయబ్‌...

- డబ్బులొస్తాయని ఎర

- దుబాయ్‌ కేటుగాళ్ల మాయ

- ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: నగర యువతి నుంచి రూ. 49.59 లక్షలు కొల్లగొట్టారు సైబర్‌ కేటుగాళ్లు. అడిషనల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌(Additional CP AV Ranganath) తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో నగర యువతికి ఒక గుర్తు తెలియని వ్యక్తి టెలీగ్రామ్‌ యాప్‌లో పరిచయమయ్యాడు. ‘‘ఇంట్లో కూర్చొని పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకోండి, మీకు పంపే లింక్‌లను లైక్‌ చేసి, సబ్ స్క్రైబ్. చేయండి.. డబ్బులొస్తాయి.. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఇన్వెస్టిమెంట్‌ చేయండి, మీకు ఇచ్చే చిన్న, చిన్న టాస్క్‌లు పూర్తి చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించండి’’ అంటూ నమ్మబలికాడు. దాంతో ఆ యువతి అతను చెప్పినట్లుగానే చేసింది. మొదట్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించిన కేటుగాళ్లు.. చిన్న, చిన్న టాస్క్‌లు ఇచ్చేవారు. అవి పూర్తి చేయగానే ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినట్లు ప్రకటించేవారు. వాటిని విత్‌డ్రా చేసుకోగానే మరికొన్ని టాస్క్‌లు ఇచ్చే వారు. వాటిని పూర్తి చేయగానే డబ్బులు ఇచ్చేవారు. అలా మెల్లగా ఊబిలోకి దింపి, ఎక్కువ మొత్తంలో రూ. 49,45,900 పెట్టుబడి పెట్టించి విత్‌డ్రా ఆప్షన్‌ క్లోజ్‌ చేశారు. దాంతో ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి టాస్క్‌లు గెలవాలని అప్పుడే డబ్బులు ఇస్తామని కండీషన్‌ పెట్టి కాంటాక్టులు కట్‌ చేశారు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించగా.. దుబాయ్‌ కేంద్రంగా కేటుగాళ్లు ఈ సైబర్‌ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.

మూడు శాతం కమీషన్‌ తీసుకుంటూ సహకారం..

ఢిల్లీకి చెందిన జానీ, ఎం.మాన్యువల్‌కు టెలీగ్రామ్‌ యాప్‌లో దుబాయ్‌కి చెందిన రైసూల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దుబాయ్‌ నుంచి యూఎస్‌ డాలర్స్‌ రూపంలో డబ్బులు పంపిస్తాను.. వాటిని ఇండియన్‌ రూపాయలుగా మార్చి తాను చెప్పిన వ్యక్తులకు డబ్బు బదిలీ చేయాలని అందుకు 3 శాతం కమీషన్‌ ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. దాంతో జానీ, మాన్యువల్‌లు కోసోస్‌ టెక్నాలజీస్‌ ప్రై. లిమిటెడ్‌ పేరుతో కరెంట్‌ అకౌంట్‌ను తీశారు. దుబాయ్‌కు చెందిన రైసూల్‌, జానీ, మాన్యువల్‌ సహా నలుగురు వ్యక్తులతో వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజూ రైసూల్‌ 3-4వేల యూఎ్‌సడీటీలు పంపుతుండగా.. జానీ, మాన్యువల్‌లు వాటిని ఇండియన్‌ కరెన్సీగా మార్చి రైసూల్‌ చెప్పిన వారికి డబ్బులు పంపిణీ చేసేవారు. మొత్తం డబ్బు మీద 3 శాతం కమీషన్‌ తీసుకునేవారు. సైబర్‌ నేరాల ద్వారా కొల్లగొట్టిన డబ్బంతా తిరిగి జానీ, మాన్యువల్‌ బ్యాంకు ఖాతాల ద్వారా తిరిగి ఇండియాకు చేరుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 52 కేసుల్లో వీరి ఖాతాల ద్వారా డబ్బులు తరలిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారి ద్వారా ఆధారాలు సేకరించి మిగిలిన సైబర్‌ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అడిషనల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌, డీసీపీ కవిత వెల్లడించారు.

Updated Date - Feb 26 , 2024 | 01:35 PM